కోయంబేడు కేసులే వంద దాటాయ్!
ABN , First Publish Date - 2020-05-23T10:26:18+05:30 IST
జిల్లాలో గురువారం రాత్రి నుంచీ శుక్రవారం సాయంత్రం వరకూ నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి.
తాజాగా పన్నూరు సబ్స్టేషన్లో 2... నాగలాపురంలో 2
అజ్మీర్ లింక్ కేసులతో కలిపి జిల్లాలో మొత్తం 229 కేసులు
తిరుపతి, మే 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురువారం రాత్రి నుంచీ శుక్రవారం సాయంత్రం వరకూ నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. విజయపురం మండలం పన్నూరు సబ్స్టేషన్ గ్రామంలో రెండు, నాగలాపురంలో మరో రెండు పాజిటివ్ కేసులను అధికారులు గుర్తించారు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకూ కోయంబేడు లింకులతో వెలుగు చూసిన కరోనా కేసుల సంఖ్య 103కు చేరుకోగా మొత్తం కేసుల సంఖ్య 217కి పెరిగింది. ఇక అజ్మీర్ లింకు కేసులు 12 కూడా కలిపి లెక్కిస్తే జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 229కి చేరింది.
కొనసాగుతున్న పునరావాస, క్వారంటైన్ కేంద్రాలు
చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలో ఏర్పాటు చేసిన 20 పునరావాస, మూడు క్వారంటైన్ కేంద్రాలు కొనసాగుతున్నాయి. తొలుత 28 చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటయ్యాయి. వీటిలో బంగారుపాళ్యం, చిత్తూరు, కలకడ, ఐరాల, చంద్రగిరి, మదనపల్లెతోపాటు రేణిగుంటలోని రెండు కేంద్రాలు మూతపడ్డాయి. మిగిలిన 20 కేంద్రాల్లో శుక్రవారానికి 1,020 మంది నిరాశ్రయులున్నారు. అలాగే మొదట 16 క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 13 మూతపడ్డాయి. మిగిలిన వాటిల్లో ఏర్పేడు మండలం వికృతమాల సెంటర్లో 512 మంది, వరదయ్యపాళ్యం ఏకం క్యాంపస్లో ఆరుగురు, తిరుపతి పద్మావతి కోవిడ్ కేర్ సెంటర్లో 16 మంది ఉన్నారు.