గొర్రెల మందపై పులి దాడి
ABN , First Publish Date - 2022-08-10T05:25:45+05:30 IST
గొర్రెల మందపై పులి దాడి
- రెండు మృతి... మరో రెండింటికి గాయాలు
- మేకను ఎత్తుకుపోయిందంటున్న కాపరులు
- పాదముద్రలు సేకరించిన అటవీ అధికారులు
మెంటాడ, ఆగస్టు 9: మండల వాసులను పులి భయం వెంటాడుతోంది. సోమవారం రాత్రి బిరసాడ వలస వద్ద జయతి గ్రామానికి చెందిన గొర్రెల మందపై పంజా విసిరింది. ఈ దాడిలో రెండు గొర్రెలు మృతి చెందగా, మరో రెండు గాయపడ్డాయి. ఒక మేకను పులి ఎత్తుకు పోయినట్టు ఈ దాడిని చూసిన గొర్రెల కాపరి చెప్పినట్టు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కేవీఎన్ రాజు తెలిపారు. మేకలు తడినేలను చిత్తడి చేయడంతో పులి పాదముద్రల పోలికలు దొరక డం లేదని, అది వెళ్లిన మార్గాన్ని అన్వేషిస్తుండగా జయతి కొండ వద్ద కనుగొన్నట్టు తెలిపారు. పులి ఒడిశా కొండలు నుంచి అప్పట్లో వచ్చిందని, ఇప్పుడు ఆ మార్గం గుండా వెళ్లినట్టు అధికారులు చెబుతున్నారు.
ఇది మూడోసారి..
మండలంలో పులి సంచరించడం ఇది మూడోసారి. ఏప్రిల్లో తొలిసారి గుర్తించారు. పులి అడుగులు, వెంట్రుకలు అటవీశాఖ అధికారులు సేకరిం చి నిర్ధారించారు. అనంతసాగరం పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తుందని భావించి నిఘా కెమేరాలు ఏర్పాటు చేసినా ఆచూకీ లభ్యం కాలేదు. మూడు నెలలు తర్వాత గత నెలలో జీటీ పేట పంచాయతీ పనుకువాని వలస వద్ద పులి సంచరిస్తుందని గిరిజనులు కర్రలు పట్టుకొని కాపలా కాశారు. ఆ మరుచటి రోజున గజపతినగరం మండలం బంగారమ్మ పేట వద్ద పులిని చూసినట్టు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. ఆ తరువాత కొత్తవలస, దత్తిరాజేరు మండలాల్లో పులి సంచరించినట్టు అధికారులు దృష్టికి వచ్చింది. ఇప్పుడు బిరసాడవలస వద్ద ప్రత్యక్షమైంది. ఇదిలా ఉండగా కొత్తవలస, గజపతినగరం, దత్తిరాజేరు మండలాల్లో సంచరిస్తున్న పులి ఇక్కడ సంచరిస్తున్న పులి ఒక్కటేనా? లేకుంటే మరొకటా అన్నది ఫారెస్టు అధికారులు కూడా తేల్చుకోలేకపోతున్నారు.