వీధి వ్యాపారుల కుటుంబాల ఆర్థిక స్థితిపై సర్వే
ABN , First Publish Date - 2022-08-05T06:10:03+05:30 IST
చిరు వ్యాపారుల ఆర్థిక స్థితిని బలోపేతం చేసేందుకు కేంద్రప్రభుత్వం దృష్టి సారించింది. వారికి పథకాలను రూ పొందించి ఆర్థికసాయం అందజేసేందుకు చర్యలు చేపడుతుంది.
కేంద్ర ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యం
నల్లగొండ, మిర్యాలగూడ మునిసిపాలిటీల్లో వీధి వ్యాపారుల సంఖ్య 8,522
చిరు వ్యాపారులపై కేంద్రం దృష్టి
(రామగిరి)
చిరు వ్యాపారుల ఆర్థిక స్థితిని బలోపేతం చేసేందుకు కేంద్రప్రభుత్వం దృష్టి సారించింది. వారికి పథకాలను రూ పొందించి ఆర్థికసాయం అందజేసేందుకు చర్యలు చేపడుతుంది. ఈ నేపథ్యంలో వారి ఆర్థిక స్థితిపై సర్వే చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ పట్టణాల్లో రహదారుల వెంట ఉంటూ చిరు వ్యాపారా లు చేసుకునే వారిని మునిసిపల్ అధికారులు సర్వే చేస్తున్నారు.
నల్లగొండ, మిర్యాలగూడ మునిసిపాలిటీల్లో ఆయా శాఖల అధికారులు చేసిన సర్వేలో 8,522 వీధి వ్యాపారులు ఉన్నారు. ఇందులో నల్లగొండలో 5,179, మిర్యాలగూడలో 3,333మంది వ్యాపారులు రూ.10వేల చొ ప్పున రుణాలు అందుకున్నారు. ఈవ్యాపారుల కుటుంబాల పరిస్థితులు ఎలా ఉన్నాయి, వారి ఆర్థిక, సామాజిక పరిస్థితి ఏమిటి, వారికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరాయి, ఇంకా ఎలాంటివి చేకూరాలి అన్న అంశాలపై మహిళా రీసోర్స్ పర్సన్ (ఆర్పీ)లు సర్వే చేస్తున్నారు. ఆయా ఆర్పీలు చేసిన సర్వే నివేదికను స్వానిధిసే సమృద్ధి యాప్ ద్వారా ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు. నల్లగొండ మునిసిపాలిటీలో 5,179 మం ది వ్యాపారులు ఉండగా 1426 మంది వ్యాపారులు కుటుంబాలపై సర్వే జరిగింది. వీరిలో 11,26 మంది కేంద్రప్రభుత్వ పథకాలకు అర్హులుగా గుర్తించారు. అదేవిధంగా మిర్యాలగూడ మునిసిపాలిటీలో 3,333 మంది వీధివ్యాపారులు ఉండగా 1,895 కుటుంబాలపై సర్వే జరిగింది. వీరిలో 1,153 మంది కేంద్రప్రభుత్వ పథకాలకు అర్హులుగా గుర్తించారు. ఈ సర్వే నిరంతర ప్రక్రియగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
కేంద్రప్రభుత్వ పథకాలు అందించేందుకు..
చిరు వ్యాపారులకు కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మం త్రి సురక్షా బీమా యోజన, భవన నిర్మాణ, ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన, ఇతర కార్మికుల నమోదు, వన్ నేషన్ వన్ రేషన్ కార్డు, జననీ సురక్షా యోజన, ప్రధాన మంత్రి మాతృవందన యోజన వంటి ఈ ఎనిమిది పథకాలను ఈ చిరు వ్యాపారులకు అందించనున్నారు. వారిలో అర్హులై వారిని ఆయా పథకాలను అందించనున్నా రు. వారికి బ్యాంకింగ్ రంగం, కార్మికశాఖ, సివిల్ సప్లై, వైద్య ఆరోగ్యశాఖ, స్త్రీశిశు సంక్షేమశాఖ వంటి ఐదుశాఖల అధికారులు చిరు వ్యాపారులకు కేంద్రప్రభుత్వ పథకాలు అందేలా మెప్మా అధికారులు సమన్వయం చేయనున్నారు. ఇదిలా ఉండగా ఆర్పీలు చేసిన సర్వే రిపోర్టును కేంద్రప్రభుత్వ శాఖ స్వానిధిసే సమృద్ధి యాప్లో చూస్తుంది. ఏ కుటుంబానికి ఏ పథకం వర్తిస్తుందో ఆ పథకం అమలు చేయాలని మునిసిపల్ అధికారులను ఆదేశించనున్నారు. ఈ మేరకు ఈ 5 శాఖల అధికారుల సహకారంతో 8 రకాల పథకాల్లో చిరు వ్యాపారులను భాగస్వామ్యం చేయనున్నారు.
కేంద్రప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యం : రమణాచారి , మునిసిపల్ కమిషనర్, నల్లగొండ
పట్టణంలో ఉన్న వీధి వ్యాపారులందరికీ కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలను అందించడమే లక్ష్యం. ఇప్పటికే పట్టణంలో వీధి విక్రయదారులను గుర్తించాం. వారికి రూ.10వేలు చొప్పున రుణాలు ఇప్పించాం. రూ.10 వేలు రుణం తీర్చిన వారికి రూ.20 వేలు బ్యాంకులు ఇవ్వనున్నాయి. ఇప్పుడు వీధి విక్రయదారుల ఆర్థిక పరిస్థితులపై సర్వే చేస్తున్నాం. సర్వే ప్రకారంగా ఎవరికి ఏ పథకం వర్తింపజేయాలో తెలుస్తుంది. పథకాల్లో నమోదు కాని వారికి పథకాలు అమలయ్యేలా ఆయా శాఖల అధికారులతో చర్చిస్తాం.