సినిమాలను తలపించే కథనం.. చిన్న మోసం కేసు దర్యాప్తులో దిమ్మతిరిగే నిజాలు!
ABN , First Publish Date - 2021-06-17T11:48:36+05:30 IST
అప్పుడెప్పుడో వచ్చిన ‘డిటెక్టివ్’ అనే సినిమాలో చిన్న కుక్కపిల్ల చనిపోయిందని మొదలైన కేసు.. పెద్ద ముఠాను పట్టిస్తుంది గుర్తుందా? అలాంటి కేసే ఇప్పుడు నిజంగా వెలుగు చూసింది.
అప్పుడెప్పుడో వచ్చిన ‘డిటెక్టివ్’ అనే సినిమాలో చిన్న కుక్కపిల్ల చనిపోయిందని మొదలైన కేసు.. పెద్ద ముఠాను పట్టిస్తుంది గుర్తుందా? అలాంటి కేసే ఇప్పుడు నిజంగా వెలుగు చూసింది. ‘‘నన్ను మోసం చేసి 6.5 లక్షల రూపాయలు కాజేశారు’’ అంటూ ఓ 78 ఏళ్ల వృద్ధుడు పోలీసు కంప్లయింట్ ఇచ్చాడు. ఎవరికి తెలుసు? ఇంత చిన్న కేసుతో మొదలైన ఈ కేసు దేశం మొత్తం వ్యాపిస్తుందని. ఇదేదో సినిమా కథలా ఉన్నా వాస్తవమే. రాజస్థాన్లోని ఉదయ్పూర్కు చెందిన ఒక 78 ఏళ్ల వృద్ధుడిని కొందరు ఫోన్లో మోసం చేశారు. ఓటీపీ యాక్సెస్ చేసి ఆయన ఖాతా నుంచి రూ.6.65లక్షలు కాజేశారు. ఈ ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఎఫ్సీఓఆర్డీ ద్వారా ట్రాక్ చేసి ఈ సొమ్ము మూడు ఎస్బీఐ కార్డుల్లో జమ అయినట్లు గుర్తించారు. ఈ కార్డులతో ఫ్లిప్కార్ట్లో జియోమీ పోకో ఎమ్3 మొబైల్స్ కొనుగోలు చేసినట్లు తెలుసుకున్నారు.
ఈ మొబైల్స్ అన్నీ నకిలీ అడ్రసులు పెట్టి బుక్ చేశారు. వీటిని బాలాఘాట్కు చెందిన హుకుం సింగ్ బిసెన్ సేకరించేవాడు. ఇతరు రైల్వేస్లో ఉద్యోగం చేస్తున్నాడు. భవిష్యత్తులో సివిల్స్ రాయాలని చూస్తున్నాడని ఆ తర్వాత తెలిసింది. ఇలా సేకరించిన మొబైల్స్ను మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రల్లో 10 డిస్కౌంట్కు అమ్మకానికి పెట్టేవారు. ఇదంతా ఒక పెద్ద ముఠా చేస్తున్న నేరం. బిసెన్ ఈ ముఠాలో కీలక వ్యక్తి. అలాగే ఉదయ్పూర్ వృద్ధుడిని ఫోన్ చేసి మోసం చేసిన జార్ఖండ్కు చెందిన సంజయ్ మహతో. అతన్ని జార్ఖండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ముఠా మొత్తం 18 రాష్ట్రాల్లో పనిచేస్తోందని దర్యాప్తులో తేలింది. కనీసం 800 మంది ఈ ముఠాలో ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది ఓటీపీ మోసాలు, క్రెడిట్ కార్డ్, ఈ-కామర్స్ మోసాలు, నకిలీ ఐడీలు, దొంగ మొబైల్ నంబర్లు, నకిలీ అడ్రసులు, బ్లాక్ మార్కెటింగ్, ట్యాక్స్ ఎగవేత, మనీ లాండరింగ్ వంటి రకరకాల ఆర్థిక నేరాలకు పాల్పడుతోందని పోలీసులు చెప్పారు. ఈ ముఠాకు చెందిన 8మంది మాస్టర్మైండ్స్ను అదుపులోకి తీసుకున్నామని, 300 మొబైల్స్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు. అయితే ఈ కేసులో చైనా కాన్స్పిరసీ కోణం ఏమైనా ఉందా? అని కూడా దర్యాప్తు చేస్తున్నారట. ఎందుకంటే ఈ ముఠా చైనా ఫోన్లనే కొనుగోలు చేస్తోంది. మరీ ముఖ్యంగా జియోమీ సంస్థ మొబైల్స్నే కొంటోంది.
అయితే ఈ మొబైల్స్కు మార్కెట్లో డిమాండ్ ఉందని, కానీ ఆ కంపెనీ కేవలం ఆన్లైన్లోనే వీటిని అమ్ముతోందని తెలుస్తోంది. అలాగే బల్క్గా ఆర్డర్లు ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. దీంతో ఇలాంటి దొంగ ముఠాలు వాటిని నకిలీ అడ్రసులతో కొనుగోలు చేసి, వాటిని రిటైల్ వ్యాపారస్థులకు 10 శాతం డిస్కంట్తో అమ్ముకుంటున్నారని సమాచారం. ఎమ్హెచ్ఏ(మినిస్ట్రీ ఆఫ్ హోం ఎఫైర్స్) ద్వారా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఒకదానికొకటి సహకరించుకొని ఈ కేసును చాలా త్వరగా ఒక కొలిక్కి తెచ్చాయి. ఎంహెచ్ఏ పోర్టల్ ఉపయోగాల్లో ఇది సక్సెస్ స్టోరీగా మిగిలింది. 20198 ఆగస్టులో అందుబాటులోకి వచ్చిన ఈ పోర్టల్ 19 రాష్ట్రాలు/యూటీల్లోని పోలీస్ స్టేషన్లు సహా మొత్తం 3వేల లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీలను 18 ఫిన్టెక్ సంస్థలతో ఆన్లైన్లో, అలాగే రియల్టైంలో కలుపుతుంది.