Shocking: కర్నాటకలో దారుణం.. కళ్ల ముందు జరిగింది చూసి భయంతో వణికిపోయిన ఈమె పిల్లలు..

ABN , First Publish Date - 2022-07-12T19:20:20+05:30 IST

వివాహేతర సంబంధాలు కన్నబిడ్డల పాలిట శాపంగా మారుతున్నాయి. క్షణిక సుఖాల మత్తులో పడి కొందరు తమ కాపురాలను చేజేతులా..

Shocking: కర్నాటకలో దారుణం.. కళ్ల ముందు జరిగింది చూసి భయంతో వణికిపోయిన ఈమె పిల్లలు..

మాండ్య: వివాహేతర సంబంధాలు కన్నబిడ్డల పాలిట శాపంగా మారుతున్నాయి. క్షణిక సుఖాల మత్తులో పడి కొందరు తమ కాపురాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ఆ వివాహేతర సంబంధం బయటపడిన తర్వాత పరిణామాలు హత్యలకు, ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. కన్నబిడ్డలకు తల్లినో, తండ్రినో దూరం చేస్తున్నాయి. కర్నాటకలోని మాండ్య జిల్లాలో తాజాగా అలాంటి ఘటనే వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాండ్య జిల్లా శ్రీరంగపట్న తాలూకాలోని ఓ గ్రామానికి చెందిన యోగితకు, రవిగౌడకు తొమ్మిది సంవత్సరాల క్రితం వివాహమైంది. పెళ్లైన రెండుమూడేళ్లు భార్యాభర్తలు అన్యోన్యంగానే ఉన్నారు. వీళ్లకు ఒక పాప, బాబు ఉన్నారు. పిల్లలు పుట్టిన కొన్నాళ్లకు భార్యపై అనాసక్తి చూపిన రవి పొరుగు ఊరికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఈ విషయం రవిగౌడ భార్యకు తెలిసింది. ఈ పరిణామం వీరి కాపురంలో కలతలకు కారణమైంది.



ఆ మహిళ విషయంలో యోగిత, రవిగౌడకు మధ్య గొడవలు జరిగాయి. ఒకరోజు ఆ మహిళతో ఉండగా యోగిత తన భర్తను రెడ్‌హ్యాండెండ్‌గా పట్టించింది. పెద్ద మనుషులు యోగిత, రవి మధ్య రాజీ కుదిర్చారు. మళ్లీ ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తే మర్యాదగా ఉండదని హెచ్చరించి యోగితతో అన్యోన్యంగా ఉండాలని రవికి సూచించారు. కొన్నాళ్లు భార్యతో బాగానే ఉన్న రవికి మళ్లీ పాడు బుద్ధి పుట్టింది. అదే మహిళతో మళ్లీ వివాహేతర సంబంధం కొనసాగించాడు. అంతటితో ఆగకుండా యోగితను చిత్రహింసలకు గురిచేయడం మొదలుపెట్టాడు. అయితే.. గత బుధవారం సాయంత్రం రవిగౌడ తన పిల్లలకు పానీపూరి కొనిపెట్టాడు. ఆ పానీపూరీ తినొద్దని పిల్లలకు యోగిత తెగేసి చెప్పింది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.



యోగితను ఇంట్లోకి ఈడ్చుకెళ్లిన రవిగౌడ వైర్‌ను ఆమె గొంతుకు బిగించి చంపేశాడు. కన్నబిడ్డల కళ్ల ముందే ఈ ఘోరం జరిగింది. తల్లిని తండ్రి అంత దారుణంగా చంపేయడం చూసి ఆ పిల్లలు భయంతో హడలిపోయారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని పిల్లలను బెదిరించి రవిగౌడ అక్కడ నుంచి పారిపోయాడు. పిల్లలు తల్లిని చూసి ఏడుస్తుండటం చూసి ఇరుగుపొరుగు వారు ఏం జరిగిందోనని ఇంట్లోకి వెళ్లి చూడగా అసలు విషయం తెలిసింది. అతనో వక్రబుద్ధి కలిగిన వ్యక్తి అని, అమ్మాయిలు ఉన్న ఇరుగుపొరుగు వారి ఇళ్లలోకి వెళ్లి సీక్రెట్‌గా సీసీ కెమెరాలు బిగించి ఆ అమ్మాయిలు స్నానం చేస్తుంటే చూసేవాడని యోగిత తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ విషయాలన్నీ తమ కూతురిని ఇచ్చి పెళ్లి చేశాక తెలిసిందని చెప్పారు. అతనిని అరెస్ట్ చేసి తమ కూతురిని అతను చంపినట్టుగానే అతనినీ చంపేయాలని యోగిత తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

Updated Date - 2022-07-12T19:20:20+05:30 IST