South China Seaలో దారుణం... రెండు ముక్కలైన నౌక...

ABN , First Publish Date - 2022-07-02T21:46:46+05:30 IST

దక్షిణ చైనా సముద్రంలో శనివారం టైఫూన్‌లో చిక్కుకున్న ఓ నౌక రెండు

South China Seaలో దారుణం... రెండు ముక్కలైన నౌక...

హాంగ్ కాంగ్ : దక్షిణ చైనా సముద్రంలో శనివారం టైఫూన్‌లో చిక్కుకున్న ఓ నౌక రెండు ముక్కలైంది. దీంతో దాదాపు 25 మంది సిబ్బంది ఆచూకీ తెలియడం లేదు. వారి కోసం విపత్తు స్పందన దళం సభ్యులు తీవ్రంగా గాలిస్తున్నారు. హాంగ్ కాంగ్ గవర్నమెంట్ ఫ్లయింగ్ సర్వీస్ ఈ వివరాలను వెల్లడించింది. 


టైఫూన్ కారణంగా ఓ ఇంజినీరింగ్ నౌక హాంగ్ కాంగ్‌కు నైరుతి దిశలో 160 నాటికల్ మైళ్ళ దూరంలో రెండు ముక్కలైందని తెలిపింది. దీనికి తీవ్ర నష్టం జరిగినట్లు పేర్కొంది. ఈ నౌకలోని 30 మంది సిబ్బంది గల్లంతయ్యారని తెలిపింది. అయితే స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల వరకు ముగ్గురిని కాపాడగలిగినట్లు, చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొంది. కొంత వరకు మునిగిపోయిన నౌక నుంచి ఓ వ్యక్తిని కాపాడుతున్నట్లు కనిపిస్తున్న వీడియోను కూడా ప్రభుత్వం షేర్ చేసింది. ఆ వ్యక్తిని ఈ నౌక నుంచి ఓ హెలికాప్టర్‌లోకి ఎక్కిస్తున్న దృశ్యం కనిపించింది. ప్రమాదం నుంచి బయటపడిన ముగ్గురు వ్యక్తులు మాట్లాడుతూ, మిగిలిన సిబ్బంది సముద్రంలో కొట్టుకునిపోయి ఉంటారని తెలిపారు. 


టైఫూన్ చాబా దక్షిణ చైనా సముద్రం మధ్య భాగంలో ఏర్పడింది. ఇది శనివారం మధ్యాహ్నానికి గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో తీరం దాటింది. ఈ నౌక ప్రమాదంలో చిక్కుకున్నట్లు హాంగ్ కాంగ్‌లోని విపత్తు స్పందన దళానికి శుక్రవారం రాత్రి సమాచారం అందింది. చాబా సెంటర్‌లో ఈ నౌక ఉన్నట్లు గుర్తించారు. విపరీతమైన గాలులు, కఠినమైన వాతావరణ పరిస్థితులు ఉండటంతో సహాయక చర్యలు మరింత సంక్లిష్టమయ్యాయి. గంటకు 144 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు వాతావరణ శాఖ తెలిపింది. సముద్రంలోని తరంగాలు 10 మీటర్ల ఎత్తుకు ఎగసినట్లు పేర్కొంది. 


ప్రమాదంలో చిక్కుకున్న నౌకలోని సిబ్బందిని కాపాడటం కోసం హాంగ్ కాంగ్ గవర్నమెంట్ ఫ్లయింగ్ సర్వీస్ రెండు విమానాలను, నాలుగు హెలికాప్టర్లను పంపించింది. అదేవిధంగా మెయిన్‌ల్యాండ్ చైనీస్ అథారిటీస్ కూడా ఓ రెస్క్యూ బోటును పంపించాయి. పరిస్థితులు అనుకూలిస్తే రాత్రి వేళ కూడా గాలింపు, సహాయక చర్యలను కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. 


Updated Date - 2022-07-02T21:46:46+05:30 IST