అర్హత సాధించకపోయినా పాలిసెట్లో సీటు!
ABN , First Publish Date - 2022-08-10T10:11:00+05:30 IST
పాలిసెట్లో క్వాలిఫై కాలేని విద్యార్థులకు పాలిటెక్నిక్ సీట్లను కేటాయించాలని అధికారులు నిర్ణయించారు.
సీట్లు మిగలడంతో అధికారుల నిర్ణయం
హైదరాబాద్, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): పాలిసెట్లో క్వాలిఫై కాలేని విద్యార్థులకు పాలిటెక్నిక్ సీట్లను కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. భర్తీ కాకుండా భారీగా సీట్లు మిగలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పాలిటెక్నిక్ సీట్ల భర్తీ కోసం పాలిసెట్ను నిర్వహించిన విషయం తెలిసిందే. వీటి ఫలితాల అనంతరం కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లను భర్తీ చేశారు. రెండు దఫాలుగా జరిగిన కౌన్సెలింగ్ అనంతరం కూడా భారీగా సీట్లు మిగిలాయి. దాంతో ఈ పాలిసెట్లో అర్హత సాధించలేకపోయిన విద్యార్థులతో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ షెడ్యూల్లో భాగంగా అభ్యర్థులు ఈ నెల 9, 10వ తేదీల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 16న సీట్లు కేటాయిస్తారు. ఇందులో సీట్లు పొందిన అభ్యర్థులు 17వ తేదీలోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని అఽధికారులు స్పష్టం చేశారు.