హైదరాబాద్లో తీగ.. కదిలిన కృష్ణా డొంక
ABN , First Publish Date - 2021-12-30T08:05:43+05:30 IST
రాష్ట్రంలో విచ్చలవిడిగా దోచుకుంటున్న ధనాన్ని హైదరాబాద్ రియల్
ఓ రియల్ఎస్టేట్ సంస్థలో ఐటీ శాఖ సోదాలు
విజయవాడ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో విచ్చలవిడిగా దోచుకుంటున్న ధనాన్ని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులుగా పెడుతున్నారు రాష్ట్ర రాజకీయ ప్రముఖులు. హైదరాబాద్లోని ఓ రియల్ ఎస్టేట్ సంస్థపై బుధవారం ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో ఈ విషయం బయటపడింది. గత రెండేళ్లుగా సదరు సంస్థలోకి పెద్ద ఎత్తున నల్లధనం పెట్టుబడుల రూపంలో తరలిందన్న పక్కా సమాచారంతో ఐటీ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా లెక్క చూపని రూ.100 కోట్ల లావాదేవీలను అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను ఐటీ అధికారులు సీజ్ చేశారు.
కృష్ణా జిల్లాకు చెందిన ఓ రాజకీయ ప్రముఖుడు ఈ సంస్థలోసుమారు రూ.100 కోట్ల పైచిలుకు పెట్టుబడులుగా పెట్టినట్టు తెలుస్తోంది. నెలరోజుల క్రితం ఓ వ్యాపారవర్గానికి ఆర్థిక లబ్ధి చేకూర్చిన వ్యవహారంలో ఈయనకు ఎనిమిది శాతం కమీషన్ ముట్టినట్టు సమాచారం. ఈ మొత్తమే సుమారు రూ.60 కోట్లు వరకు ఉంటుందని, ఆ మొత్తాన్ని కూడా నెల క్రితమే సదరు రియల్ సంస్థలోకి తరలించినట్టు చెబుతున్నారు. ఏడాది క్రితం ఈ సంస్థకు చెందిన వ్యక్తులు హైదరాబాద్కు సమీపంలోని షామీర్పేట్లో 110 ఎకరాలు కొన్నట్టు సమాచారం. ఈ మొత్తం లావాదేవీలపై దృష్టి సారించిన ఐటీ అధికారులు....దాడులకు సంబంధించిన వివరాలను మాత్రం ధ్రువీకరించడం లేదు.