ఆ తీర్పుపై సమీక్ష అనవసరం

ABN , First Publish Date - 2021-07-09T06:13:32+05:30 IST

‘మద్రాస్‌ హైకోర్టు తీర్పును సమీక్షించాలి’ అంటూ పిల్లి ప్రసన్నకుమార్‌ రాసిన ఉత్తరం ఈ నెల ౩న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమయింది...

ఆ తీర్పుపై సమీక్ష అనవసరం

‘మద్రాస్‌ హైకోర్టు తీర్పును సమీక్షించాలి’ అంటూ పిల్లి ప్రసన్నకుమార్‌ రాసిన ఉత్తరం ఈ నెల ౩న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమయింది. ఆ ఉత్తరంలో పరస్పర విరుద్ధ అంశాలున్నాయి. ‘‘హిందూ ‘మతం’ వేరు, ‘కులం’ వేరు కాదు... క్రైస్తవం స్వీకరించినా కులం రూపంలోని మతం వారిని వెంటాడుతూనే ఉంటుంది’’ అని ఒకచోట, ‘‘మనిషిని మనిషిగా గుర్తించని మతాన్ని వదిలి సమానత్వాన్ని బోధించే ఏ మతంలోకైనా వెళ్ళే హక్కు ఈ దేశ పౌరులకు లేదా?’’ అని మరోచోట రాశారు. ప్రసన్నకుమార్‌ అన్నట్టుగానే హిందూ మతం హిందూ సమాజాన్ని కులాల పరంగా చీల్చినది. అంటరానివారు అంటూ కొన్ని వర్గాలను వేధించింది. అటువంటి మతంలో ఉండాల్సిన అవసరం లేదు. క్రైస్తవ మతం ఇందుకు భిన్నమైనది, దీనికిన్నా మహత్తరమైనది అయినప్పుడు, అందులో సామాజికవర్గాలు లేనప్పుడు, చర్మపు రంగుని బట్టి అహంకారం లేనప్పుడు, మరి అటువంటి గొప్ప మతంలోకి వెళ్లిన తర్వాత ఇక మీరు తిరస్కరిస్తున్న హిందూ మతం ద్వారా వచ్చిన కులం ఎందుకు? త్యజించేది మతాన్నే కాని కులాన్ని కాదు అన్నట్లుగా ఉంది ఆయన వాదన. హిందూ మతమే వద్దనుకున్నప్పుడు ఆ మతం వాసన అయిన కులాన్ని క్రైస్తవంలోకి తీసుకు వెళ్ళడం ఎందుకు? మనిషిని మనిషిగా గుర్తించే మతం క్రైస్తవం అని నమ్ముతున్న వాళ్లు ఆ కొత్త మతంలోకి వెళ్ళి కూడా నా కులం నాదే అని అనడంలో అర్థం లేదేమో. అలా క్రైస్తవంలో లేని కులాన్ని చొప్పించే ప్రయత్నం దయచేసి చేయవద్దు. అలా చేయడం సమసమాజ స్థాపకుడైన జీసస్‌ని అవమానించటమే. పవిత్ర క్రైస్తవాన్ని కులంతో కలుషితం చేయవద్దు. మనిషిని మనిషిగా గుర్తించే క్రైస్తవంలోనే తరించండి. మద్రాస్‌ హైకోర్టు తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదు.

డా. దుగ్గరాజు శ్రీనివాసరావు, విజయవాడ

Updated Date - 2021-07-09T06:13:32+05:30 IST