ఉత్తర కాశీ వద్ద పీలేరు వాసి మృతి
ABN , First Publish Date - 2022-07-01T05:30:00+05:30 IST
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తర కాశీ పట్టణం సమీపంలో పీలేరుకు చెందిన బొగ్గరపు బాలాజీ (60) దుర్మరణం చెందాడు. చార్ధామ్ యాత్రకు వెళ్లిన అతను గురువారం సాయంత్రం కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో మరణించినట్లు అతని సహచరులు సమాచారం అందించారు.
పీలేరు, జూలై 1: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తర కాశీ పట్టణం సమీపంలో పీలేరుకు చెందిన బొగ్గరపు బాలాజీ (60) దుర్మరణం చెందాడు. చార్ధామ్ యాత్రకు వెళ్లిన అతను గురువారం సాయంత్రం కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో మరణించినట్లు అతని సహచరులు సమాచారం అందించారు. వివరాలిలా... పీలేరులోని 15 కుటుంబాలు వారం క్రితం చార్ధామ్ యాత్రకు బయలుదేరి వెళ్లారు. వారిలో పీలేరు పట్టణానికి చెందిన వ్యాపారి బాలాజీ కుటుంబం కూడా ఒకటి. ఈ క్రమంలో వారందరూ పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ గురువారం సాయంత్రం ఉత్తర కాశీ వద్దకు చేరుకున్నారు. వారు ప్రయాణిస్తున్న దారిలో కొండచరియలు విరిగి రోడ్డుకు అడ్డుగా పడి ఉండడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఈ లోపు పక్కనే ఉన్న లోయ ప్రాంతంలో బాలాజీ బహిర్భూమికి వెళ్లాడు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన సహచరులు వెళ్లి చూడగా అతను ఉన్న ప్రాంతంలో కొండచరియలు విరిగి వాటి కింద అతను పడి మృతి చెందినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని వారు పీలేరులోని అతని కుటుంబ సభ్యులకు తెలియజేయగా వారు శుక్రవారం ఉదయం బయలుదేరి సాయంత్రానికి అక్కడకు చేరుకుని అక్కడే అతని అంత్యక్రియలు పూర్తి చేశారు. బాలాజీ మృతి వార్త పీలేరులోని వ్యాపార వర్గాల్లో విషాదం నింపింది.