ఆలస్యంగా అయితే ఒక రేటు ... అత్యవసరమైతే మరో రేటు
ABN , First Publish Date - 2022-06-10T06:07:21+05:30 IST
భూముల ధ్రువీకరణలో ముఖ్యమైన పత్రం ఎనకంబరెన్స సర్టిఫికెట్. భూముల కొనుగోలు, అమ్మకాల సమయంలో ఈసీ కోసం రిజిస్ట్రేషన కార్యాలయాలకు వెళుతుంటారు.
ఆ గదిలో...
ఆలస్యంగా అయితే ఒక రేటు
అత్యవసరమైతే మరో రేటు
ఈసీ కావాలంటే రూ.15 వేలు
ఇతర ధ్రువ పత్రాలకు రూ.వెయ్యి
రికార్డ్ రూమ్లో బహిరంగ వసూళ్లు
రామ్నగర్ సబ్ రిజిసా్ట్రర్ కార్యాలయంలో దందా
భూముల ధ్రువీకరణలో ముఖ్యమైన పత్రం ఎనకంబరెన్స సర్టిఫికెట్. భూముల కొనుగోలు, అమ్మకాల సమయంలో ఈసీ కోసం రిజిస్ట్రేషన కార్యాలయాలకు వెళుతుంటారు. అతి ముఖ్యమైన ధ్రువీకరణ పత్రం కావడంతో, ‘డిమాండ్’ ఎక్కువగా ఉంటుంది. అందుకే.. రిజిస్ట్రేషన కార్యాలయాల్లో కొందరు దీన్ని సొమ్ము చేసుకుంటున్నారు. మాన్యువల్గా ఇచ్చే ఈ సర్టిఫికెట్... నెలరోజులైనా ఇవ్వడం లేదు. ఆ తరువాతకూడా రూ.వెయ్యి చేతిలో పెడితేగానీ పని జరగడం లేదని బాధితులు వాపోతున్నారు. అర్జెంటుగా కావాలని తొందర పెడితే రూ.5 వేల నుంచి రూ.15 వేలు ముట్టజెప్పాల్సిందే అంటున్నారు.
అనంతపురం నగరంలోని సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో ఈ దందా మరింత ఎక్కువగా జరుగుతోంది. కార్యాలయంలోని రికార్డు రూమ్ ఈ దందాకు అడ్డాగా మారిందని అంటున్నారు. అందులో పనిచేస్తున్న ఓ ప్రైవేట్ వ్యక్తి ఈ ముడుపుల వ్యవహారంలో చక్రం తిప్పుతున్నారు. ఆర్హెచ, నకలు కాపీలు తీసుకోవాలన్నా చేయి తడపాల్సిందే. వివాహ ధ్రువీకరణ పత్రం కావాలన్నా.. తాంబూలం ముట్టజెప్పాల్సిందే అంటున్నారు.
అనంతపురం క్రైం
ఖరీదైన వ్యవహారం
ఎనకంబరెన్స సర్టిఫికెట్ కోసం ప్రజలు రిజిసా్ట్రర్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తోంది. భూ వివాదాల పరిష్కారానికి ఈసీ కీలకం. ఈ ధ్రువీకరణ పత్రంలో ఆస్తి వివరాలు, యజమాని, యాజమాన్యం బదిలీలు, తనఖా.. తదితర వివరాలు కొన్నేళ్ల నుంచి ఉంటాయి. రామ్నగర్లోని సబ్రిజిస్ర్టార్ కార్యాలయంలో మాన్యువల్ ఈసీకి రూ.220 చలానా చెల్లించాలి. ఇక్కడ అనంతపురం ప్రస్తుతం వరకు, అనంతపురం రూరల్ సబ్ రిజిస్ర్టార్ కార్యాలయం 2007, శింగనమల కార్యాలయం 1982, పామిడి సబ్ రిజిస్ర్టార్ కార్యాలయం 1971లోపు వివరాలు లభిస్తాయి. ఈసీ కోరేవారు నెలరోజుల వరకు ఉండగలిగితే.. రూ.800 నుంచి రూ.1000 వరకు ఖర్చు అవుతుంది. ఒకటి, రెండురోజుల్లోనే కావాలంటే మాత్రం భారీగా సమర్పించాల్సిందే. భూ మి వివరాలను బట్టి రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు పుచ్చుకుంటారని సమాచారం. ఆనలైనలో ఈసీ ఇచ్చే రాషా్ట్రల్లో మన రాష్ట్రం సైతం ఉంది. ఈ సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో మాన్యువల్ ఈసీని వారంరోజుల్లో ఇవ్వాలనే నిబంధన ఉంది. కానీ అక్కడున్న సిబ్బంది తొక్కిపెడుతున్నారు.
ఆర్హెచ, నకలుకూ అంతే..
రియల్ వ్యాపారాలు, భూ తగాదాల విషయాల్లో ఆర్హెచ, నకలు కాపీలు కీలకంగా మారాయి. భూమికి 1953 సంవత్సరంలోపు పట్టా వచ్చి ఉంటే ఆర్హెచలో ఎంటరై ఉంటుంది. రిజిస్ర్టార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆర్హెచ కాపీ అందజేస్తారు. 1982 సంవత్సరానికి ముందు రిజిస్ర్టేషన చేసుకున్న డాక్యుమెంట్కు సంబంధించి నకలు కాపీ లోపులు కోరుతారు. ఇలాంటి వాటిని ఇచ్చేందుకు భారీగా వసూలు చేస్తున్నారు. ఆర్హెచ కాపీకి రూ.400, నకలు కాపీకి రూ.240 చలానా చెల్లించాలి. వాటిని వారం రోజుల్లో ఇస్తారు. ఆర్హెచ కాపీ పొందాలంటే రూ.700 నుంచి రూ.800 వరకు, నకలు కాపీ అయితే రూ.450 నుంచి రూ.500 వరకు అదనంగా ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు.
ఆర్హెచ, నకలు కాపీల కోసం ప్రతి రోజూ 25 నుంచి 50 వరకు దరఖాస్తులు అం దుతున్నట్లు సమాచారం. మ్యారేజ్ సర్టిఫికెట్ పొందాలనుకునే వారు చలానా రూ. 205 చెల్లించాలి. దీనికి అదనంగా రూ.వెయ్యి వరకు ముట్టజెప్పాలట.
రికార్డు రూమ్లో దందా...
రామ్నగర్ రిజిస్ర్టార్ కార్యాలయంలోని రికార్డు రూమ్ ప్రత్యేకం. మొత్తం ఐదు రిజిస్ర్టార్ కార్యాలయాలతో సంబంధం ఉండటమే ఇందుకు కారణం. ఆ గది నిత్యం కిటకిటలాడుతుంటుంది. ఇక్కడ బడా రియల్టర్ల నుంచి ముడుపులు తీసుకుంటే బయటకు పొక్కేది కాదేమో. ఇక్కడికి సామాన్యులు కూడా వెళతారు. వారి నుంచి కూడా వసూలు చేస్తారు. దీంతో రికార్డ్ రూం వ్యవహారం పెద్ద విషయమేమీ కాదు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఈసీ, ఆర్హెచ, నకలు కాపీలు, మ్యారేజ్ సర్టిఫికెట్ల విషయంలో ఓ ప్రైవేట్ వ్యక్తి అంతా తానై వ్యవహారం నడిపిస్తున్నాడు. అతని ఒక రోజు ఆదాయమే రూ.వేలల్లో ఉంటుందని, నెలకు లకారాల్లో ఆదాయం వస్తోందని సమాచారం. మరో ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగులకు ఇందులో భాగముందనే ఆరోపణలు ఉన్నాయి. ఆ విభాగాన్ని పర్యవేక్షించే సీనియర్ అసిస్టెంట్ చూసీ చూడనట్లు ఉంటున్నారా...? లేక ఆయన కూడా పరోక్షంగా మద్దతిస్తున్నారా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎదురుగా ఇద్దరు సబ్ రిజిస్ర్టార్లు, పైన జిల్లా స్థాయి ఉన్నతాధికారి ఉంటున్నా.. ముడుపుల బాగోతం ఎవరికీ పట్టకపోవడం గమనార్హం.