అరుదైన గౌరవం.. అందరం కాపాడుదాం..
ABN , First Publish Date - 2022-08-10T05:47:02+05:30 IST
స్వాతంత్య్ర వజ్రోత్సవ వేళ ఆజాదీకా అమృత ఉత్సవాల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హర్ఘర్ తిరంగా పేరుతో ఇంటింటా త్రివర్ణ పతాక ఆవిష్కరణకు
ఖమ్మం కలెక్టరేట్, ఆగస్టు 9 : స్వాతంత్య్ర వజ్రోత్సవ వేళ ఆజాదీకా అమృత ఉత్సవాల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హర్ఘర్ తిరంగా పేరుతో ఇంటింటా త్రివర్ణ పతాక ఆవిష్కరణకు పిలునిచ్చాయి. ఇందులో భాగంగా 13, 14, 15 తేదీల్లో ఎవరిళ్లపై వారే జాతీయ జెండాను ఆవిష్కరించుకునే అరుదైన అవకాశాన్ని కల్పించింది. కానీ జాతీయత, లౌకికతత్వానికి ప్రతీకగా ఎంతో పవిత్రంగా చూసుకునే మువ్వెన్నల పతాకావిష్కరణ సమయంలో నిబంధనలు పాటించి అరుదైన గౌరవాన్ని కాపాడుకోవాల్సి ఉంటుందని ‘ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా’ సూచిస్తోంది. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపం, జాతీయ ఆత్మగౌరవానికి చిహ్నమైన జెండా పట్ల సార్వత్రిక అభిమానం, గౌరవం, విధేయత చూపాలి. 13న ఉదయం సూర్యోదయం తర్వాత ఇళ్ల వద్ద పతాకాన్ని ఎగుర వేసి 15న సూర్యాస్తమయం అయ్యేలోపు కిందికి దించాల్సి ఉంటుంది.
‘హర్ఘర్ తిరంగా’లో పాటించాల్సిన నిబంధనలివీ..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిన తేదీలు, సమయాల్లో ఇళ్ల వద్ద జెండాను ప్రదర్శించి అవనతం చేయాల్సి ఉంటుంది.
చేతితో నేసిన లేదంటే యంత్రంపై తయారు చేసిన పత్తి, పాలిస్టర్, ఉన్ని, సిల్క్ ఖాదీ లాంటి వాటితో తయారు చేసిన జెండాను ఎగురవేయాలి.
జాతీయ జెండా దీర్ఘచతురస్రాకారంలో, పొడవు, వెడల్పుల నిష్పత్తి 2:3గా ఉండాలి.
దెబ్బతిన్న, చిరిగిన, మరకలు అంటిన, ముడతలు పడిన, రంగువెలిసిన జెండాను ప్రదర్శించవద్దు.
జాతీయ జెండాతో పాటు ఏ ఇతర జెండాను స్థాయి, పరిమాణం, ఎత్తులో సమానంగా ఎగురవేయకూడదు.
వస్తువులను చుట్టడానికి, స్వీకరించడానికి జాతీయ జెండాను వినియోగించవద్దు.