ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటు తప్పదు
ABN , First Publish Date - 2022-05-19T06:56:18+05:30 IST
అసమర్థపాలనతో ప్రజా సంక్షేమాన్ని నీరుగార్చిన వైసీపీ ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటు తప్పదని సీపీఐ రాష్ట్రకార్యవర్గ సభ్యులు జగదీష్ విమర్శించారు
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్
కళ్యాణదుర్గం, మే 18: అసమర్థపాలనతో ప్రజా సంక్షేమాన్ని నీరుగార్చిన వైసీపీ ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటు తప్పదని సీపీఐ రాష్ట్రకార్యవర్గ సభ్యులు జగదీష్ విమర్శించారు. బుధవారం స్థానిక కన్యాకపరమేశ్వరి కల్యాణమండపంలో జిల్లా నేతలతో కలిసి పార్టీ 24వ జిల్లా మహాసభల ఆహ్వాన సంఘ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కార్యదర్శి జాఫర్, సీనియర్ నాయకులు ఎంవీ రమణ, సహాయ కార్యదర్శులు నారాయణస్వామి, మల్లికార్జున, రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు సంజీవప్ప, నియోజకవర్గ కార్యదర్శి గోపాల్ హాజరయ్యారు. ప్రజలకు, రైతులకు ఎం ఒరగపెట్టారని గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని నిలదీశారు. సీఎం జగన్ మోసపూరిత పాలనలో రాష్ట్రం అధోగతిపాలైందని మండిపడ్డారు. నరత్నాల పేరుతో అడుగడుగునా మోసం చేశారని ధ్వజమెత్తారు. సిగ్గులేని పాలకులు గడప ఎలా తొక్కబోతున్నారని విమర్శించారు. అతివృష్టి, అనావృష్టి కారణంగా పంటనష్టం జరిగితే ఎమ్మెల్యేలు, మంత్రులు అటువైపు కన్నెతి చూసిన దాఖలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్లు గడుస్తున్న ఒక్క రైతుకు కూడా ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా అందించి ఆదుకోలేదని అయితే రైతు ప్రభుత్వమంటూ గొప్పులు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. స్థానిక ఎమ్మెల్యే , మంత్రి ఉష శ్రీచరణ్ పూటకొసారి చెరువులకు నీరు నింపుతామని ప్రకటిస్తూ ఆర్భాటం చేయడాన్ని తప్పుబట్టారు. మూడేళ్లు పాలనలో గంపమట్టి వేసిందిలేదు, భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇచ్చిందిలేదని దుయ్యబట్టారు. జూన్ 25, 26వ తేదీల్లో కళ్యాణదుర్గంలో జరిగే జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈసభల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను సమీక్షించి ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతామని ప్రకటించారు. కార్యక్రమంలో నాయకులు పద్మావతి, అమీనా, శకుంతల, లింగమయ్య, కేశవరెడ్డి, రమణయ్య, శ్రీరాములు, నాగరాజునాయక్, గోవిందు, అశ్వత్థ పాల్గొన్నారు.