బాలల భద్రతకు పెద్దపీట
ABN , First Publish Date - 2021-02-27T05:26:50+05:30 IST
బాలల భద్రతకు పెద్దపీట వేయాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని కలెక్టర్ నివాస్ ఆదేశించారు. జడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన బాలల రక్షణ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
చైల్డ్కేర్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో నిఘా
చిన్నారులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
కలెక్టర్ నివాస్
గుజరాతీపేట, ఫిబ్రవరి 26: బాలల భద్రతకు పెద్దపీట వేయాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని కలెక్టర్ నివాస్ ఆదేశించారు. జడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన బాలల రక్షణ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ‘చైల్డ్కేర్ కేంద్రాలను పక్కాగా నిర్వహించాలి. సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలి. వచ్చిపోయే వారిపై పర్యవేక్షణ అవసరం. వివిధ ప్రదేశాల్లో రక్షించిన బాలలను పాఠశాలల్లో చేర్పించాలి. వారి చదువు, ఆరోగ్యం, తదితర అంశాలను తరచూ పర్యవేక్షించాలి. చిన్నారులకు పూర్తి సహకారం అందించాలి. అన్ని రిజిష్టర్లు పక్కాగా ఉండాలి. స్టేట్ హోమ్లో సామర్థ్యం పెంచాలి. చిన్నారుల భద్రతపై ఎటువంటి నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవు’ అని కలెక్టర్ హెచ్చరించారు. జువైనల్ కోర్టు ప్రధాన జడ్జి కె.రాణి మాట్లాడుతూ చిన్నారులకు మంచి వాతావరణం కల్పించాలని సూచించారు. జిల్లా బాలల రక్షణాధికారి కేవీ రమణ మాట్లాడుతూ, 18 ఏళ్లలోపు వారు బాలబాలిక రక్షణ చట్టం కిందకు వస్తారన్నారు. ‘బాలల అక్రమ రవాణా, వారిని పనిలో పెట్టడంపై జిల్లాలో 398 కేసులు నమోదయ్యాయి. ఇందులో 18 కేసుల్లో నిందితులకు శిక్ష పడింది. 60 కేసులు విచారణలో ఉన్నాయి. గుజరాత్, వీరావల్ వంటి ప్రాంతాలకు వెళ్లే చిన్నారులు ప్రమాదకర పరిస్థితుల్లో పని చేస్తున్నారు. బాలల రక్షణకు జిల్లాలో 517 గ్రామ, 11 పట్టణ, 11 మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేశాం. 20 చైల్డ్కేర్ కేంద్రాల్లో 315 మంది చిన్నారులు ఉన్నారు’ అని బాలల రక్షణాధికారి వివరించారు. ఈ సమావేశంలో జేసీ కె.శ్రీనివాసులు, ఏఎస్పీ సోమశేఖర్, సీడబ్ల్యూసీ చైర్మన్ జి.నరసింహమూర్తి, ఐసీడీఎస్ పీడీ జయదేవి, ఏడీఎంహెచ్వో బి.జగన్నాథరావు, సాంఘిక సంక్షేమశాఖ డీడీ వెంకటరత్నం, జిల్లా బీసీ సంక్షేమాధికారి కృత్తిక, కార్మిక శాఖ సహాయ కమిషనర్ పురుషోత్తం, బాలల పర్యవేక్షణాధికారి సత్యనారాయణరావు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.