అయోధ్య రామాలయం కోసం భూమి కొనుగోలు

ABN , First Publish Date - 2021-03-03T21:11:46+05:30 IST

అయోధ్య రామాలయం సముదాయం మరింత విశాలంగా

అయోధ్య రామాలయం కోసం భూమి కొనుగోలు

లక్నో : అయోధ్య రామాలయం సముదాయం మరింత విశాలంగా ఉండాలన్న లక్ష్యంతో అదనపు భూమిని కొన్నారు. శ్రీరామ జన్మ భూమికి ఆనుకుని ఉన్న 676.85 చదరపు మీటర్ల భూమిని రూ.1 కోటి చెల్లించి, రిజిస్ట్రేషన్ చేయించారు. శ్రీరామ జన్మ భూమికి ఆనుకుని ఉన్న ఇళ్లు, ఇతర స్థలాలను కొనేందుకు వాటి యజమానులతో చర్చలు జరుగుతున్నాయి. 


స్వామి దీప్‌నారాయణ్‌కు చెందిన ఈ భూమిని రూ.1 కోటి చెల్లించి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కొనుగోలు చేసింది. ఈ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ ఈ లావాదేవీని నిర్వహించారు. క్రియచీటీపై గోసాయిన్‌గంజ్ ఎమ్మెల్యే ఐపీ తివారీ (బీజేపీ), ట్రస్ట్ సభ్యుడు, ఆరెస్సెస్ అయోధ్య ప్రచారక్ డాక్టర్ అనిల్ మిశ్రా సాక్షులుగా సంతకాలు చేశారు. 


అయోధ్య రామాలయం సాధ్యమైనంత విశాలమైన స్థలంలో ఉండాలన్నది అసలు లక్ష్యం. దీనికి అనుగుణంగానే శ్రీరామ జన్మభూమికి ఆనుకుని ఉన్న పాత ఇళ్లు, స్థలాలను ట్రస్టు కొనుగోలు చేస్తోంది. 2019 నవంబరు 9న సుప్రీంకోర్టు తీర్పుతో శ్రీరామ జన్మ భూమికి 70 ఎకరాల స్థలం లభించింది. దీనిని 107 ఎకరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుని, డిజైన్లను తయారు చేశారు. గర్భ గుడితో కూడిన రామాలయాన్ని ఐదు ఎకరాల స్థలంలో నిర్మిస్తారు. మ్యూజియం, గ్రంథాలయం, యాగశాల, శ్రీరాముని జీవితాన్ని వివరించే చిత్రపటాల ప్రదర్శన వంటివాటి కోసం మిగిలిన స్థలాన్ని వినియోగిస్తారు. 


భారీ నిధి సేకరణ

రామాలయం నిర్మాణం కోసం నిధి సేకరణను జనవరి 15 నుంచి ప్రారంభించారు. 44 రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో రూ.2,500 కోట్లు సేకరించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 27తో ఈ కార్యక్రమం ముగిసింది. ట్రస్టు సభ్యులు చెప్తున్న వివరాల ప్రకారం నిధి సేకరణపై ఆడిట్ జరుగుతోంది.


Updated Date - 2021-03-03T21:11:46+05:30 IST