ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2022-08-09T07:11:23+05:30 IST
ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పట్టణ పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం
సూర్యాపేటక్రైం, ఆగస్టు 8 : ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పట్టణ పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని సీతారాంపురం ప్రాంతానికి చెందిన మోర సైదులు(35) పట్టణంలోని హెడ్పోస్టాఫీస్ ఎదురుగా వెల్డింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే సైదులు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నెల 3వ తేదీన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి వెళ్లి ఈ నెల 6వ తేదీ వరకు చికిత్స పొందాడు. అనంతరం ఇంటికి వచ్చాడు. అయితే ఈ నెల 7వ తేదీన తెల్లవారుజామున ఇంటి నుండి బయటకు వెళ్లాడు. భార్య విజయలక్ష్మి నిద్రలేచి చూసే సరికి సైదులు కనిపించలేదు. కొంత సమయం చూసినప్పటికీ ఇంటికి రాలేదు. వెంటనే బంధువులకు ఫోన్లు చేసి సమాచారం ఆరా తీసినా ఆచూకీ లభించలేదు.
చెప్పులు, బైక్ ఉండటంతో
ఇదిలా ఉంటే సోమవారం ఉదయం సద్దులచెరువు వద్ద సైదులు బైక్, చెప్పులు కనిపించాయి.దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు జాలర్లతో వెతికించగా సైదులు మృతదేహం లభ్యమైంది. మత్స్యకార్మికుడైన సైదులు చేపల కోసం వచ్చిన చెరువులో ప్రమాదవశాత్తు పడి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. సైదులుకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. భార్య విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్ఐ క్రాంతికుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.