భూసమస్యలకు శాశ్వతపరిష్కారం

ABN , First Publish Date - 2020-09-15T06:08:34+05:30 IST

రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టం అన్నది ఆరంభం మాత్రమేనని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. అన్ని వర్గాల వారికి భూ సంబంధిత ఇబ్బందులు తొలిగించేలా...

భూసమస్యలకు శాశ్వతపరిష్కారం

భవిష్యత్‌లో చేపట్టనున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత చారిత్రాత్మక సర్వే–-సెటిల్మెంట్ సాలార్‌జంగ్ సంస్కరణల కంటే మిన్నగా ఉంటుందని భావించవచ్చు. డిజిటల్ సర్వే కాబట్టి తప్పొప్పులకు ఆస్కారం ఉండే అవకాశం లేదు. గ్రామ వ్యవసాయ, -వ్యవసాయేతర భూముల రికార్డులన్నీ పూర్తిగా ప్రక్షాళన జరిగి, శాశ్వతంగా, రైతు ప్రాతిపదికన సర్వే నంబర్లుండే విధానానికి శ్రీకారం చుడతామని, భవిష్యత్‌లో ఏ విధమైన తగాదాలకు ఆస్కారం లేకుండా ఈ రికార్డులు ఉంటాయని ముఖ్యమంత్రి చెప్పారు. వతన్‌దారీ విధానం రద్దు దరిమిలా అస్తవ్యస్తమైన గ్రామీణ పాలనావ్యవస్థ పటిష్టం కాబోతోంది అనుకోవాలి.


రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టం అన్నది ఆరంభం మాత్రమేనని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. అన్ని వర్గాల వారికి భూ సంబంధిత ఇబ్బందులు తొలిగించేలా దశలవారీగా మరిన్ని మెరుగైన విధానాలను తీసుకొని రానున్నామని రాష్ట్ర శాసనసభలో ప్రకటించారు. శతాబ్దాలుగా ఉన్న భూముల సమస్యలకు సమగ్ర డిజిటల్‌ సర్వే ఉత్తమ పరిష్కారమని పేర్కొన్నారు. అత్యాధునిక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయంతో వీలైనంత త్వరగా రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్‌ సర్వే చేస్తామని చెప్పారు. విజయవంతంగా సర్వే పూర్తైన తరువాత కన్‌క్లూజివ్‌ టైటిల్‌ దశకు చేరుకుంటామన్న ఆశాభావం వ్యక్తం చేశారు సిఎం; కన్‌క్లూజివ్‌ టైటిల్‌ ఇస్తేనే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. 


వ్యవసాయాధారిత గ్రామాలు మన దేశచరిత్రలో అంతర్భాగాలు. ప్రతీ గ్రామం ఒక రిపబ్లిక్. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ల దాకా, గ్రామంలో తలెత్తే అన్ని సమస్యలనూ గ్రామస్థులే పరిష్కరించుకునేవారు. ఆంగ్లేయులు కూడా గ్రామాలలో వచ్చే ఆదాయం మీద కన్నేశారు కాని గ్రామ కట్టుబాట్ల జోలికి పోలేదు. గ్రామానికీ- మరో గ్రామానికీ మధ్య పోలిమేరలే తప్ప సరిహద్దులుండేవి కాదు. 19వ శతాబ్దం వరకు వ్యవసాయ భూములకు కూడా హద్దులుందేవి కాదు. మొఘల్ చక్రవర్తులు అక్బర్, షేర్షాలు వ్యవసాయ భూముల కొలతలు ప్రారంభించారే కాని శాశ్వతం చేయలేదు. 


19వ శతాబ్దం మధ్యకాలం దాకా తెలంగాణ జిల్లాలలో ఒక నిర్దుష్టమైన పాలనావ్యవస్థ లేదనే అనాలి. గ్రామాలలో మాత్రం అనాదిగా వస్తున్న సంప్రదాయాలనే కొనసాగించేవారు. ‘కరణం’ భూమి లెక్కలు, ‘మునసబు’ శాంతిభద్రతలు చూసుకునేవారు. కాకతీయుల పాలనా కాలంలో గణపతి దేవ రాజు బ్రాహ్మణులలో ఒక ఆరువేల మందికి శిక్షణ ఇచ్చి గ్రామ కరణాలుగా తయారుచేశారు. గ్రామ ఆదాయ-–వ్యయ లెక్కలు వీరు చూసేవారు. సాలార్‌జంగ్‌ సంస్కరణల్లో భాగంగా గ్రామాలకు సంబంధించి ‘గిర్దావర్’ అనే అధికారిని నియమించింది ప్రభుత్వం. పోలీసు చర్య జరిగేదాకా ఇలాంటి వ్యవస్థే కొనసాగింది. ఈ వ్యవస్థ 1956లో ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు కొనసాగింది.


1853లో మొదటి సాలార్‌జంగ్‌ అప్పటి నిజాంకు ప్రధానిగా నియమితుడయ్యక ప్రారంభించిన ‘జిల్లా బందీ’ విధానం చాలా కాలం అమల్లో ఉంది. సాలార్‌జంగ్ సలహాతో నిజాం రాజ్యంలోని గ్రామాలలో ఉన్న భూములను సర్వే చేయించి, క్రమబద్ధమైన రికార్డులను మొదటిసారిగా రూపొందించాడు. తిరిగి 1936లో మూడవ సాలార్‌జంగ్ సర్వే చేయించేంతవరకు ఇవే లెక్కలుండేవి. ఇంతకు ముందు ఇలాంటి సర్వే ఎప్పుడూ చేయలేదు. సర్వే చేయడానికి పూర్వం ఎవరు, ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారన్న వివరాలు గ్రామాధికారికి తప్ప ఎవరికీ తెలియదు. రైతులు వ్యవసాయం చేసే భూములకు నిర్దుష్టమైన రికార్డులు, సరిహద్దులు లేవు. ‘పట్టాదారు’ భూములు అనే పదం సాలార్‌జంగ్ సర్వే–-సెటిల్మెంట్ ద్వారా స్థిరపడింది మొదటిసారి.


సాలార్‌జంగ్ చేయించిన సర్వే తరువాత, వ్యవసాయ భూముల సారాన్ని బట్టి అణాల లెక్కల్లో ‘ఆనావారి’ రిజిస్టర్లను ఏర్పాటు చేశారు. వీటినే ‘సేత్వార్’ అని కూడా పిలిచేవారు. గ్రామాల్లోని రైతుల భూముల కొరకు ‘నక్షా’ (పటం)ను శాశ్వత ప్రాతిపదికగా ఉండే విధంగా సిల్కు గుడ్డ మీద నల్ల సిరాతో గీసి ఏర్పాటు చేశారు. ఇవి ఈ నాటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. రైతుల భూముల్లో ఉన్న రాళ్లు, గుంటలు, వ్యవసాయానికి పనికి రాని స్థలాన్ని ‘పూట్ కరాబ్’ అని పేర్కొని దానికి శిస్తును రద్దు చేశారు. అప్పట్లో రైతుల భూములకు తప్ప ప్రభుత్వ భూములకు ఎలాంటి రికార్డుల్ని రూపొందించలేదు. 


సర్వే–-సెటిల్మెంట్ తర్వాత రికార్డులను కాపాడే బాధ్యత పట్వారీకి అప్పచెప్పారు. శిస్తు వసూలుకు మాలీ పటేల్, శాంతి భద్రతలకు పోలీస్ పటేల్‌ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. పంచాయితీరాజ్ వ్యవస్థ వచ్చేంతవరకు గ్రామాలలో అధికారమంతా పటేల్, పట్వారీలదే. పట్వారీ తహసీల్దారు కార్యాలయానికి తెలియచేయడానికి తయారు చేసే ‘బారిష్ తఖ్తా’ లో చెరువులో కొత్తగా ఎంత నీరు, ఎప్పుడు చేరింది అన్న వివరాలుండేవి. అనావృష్టి, అతివృష్టి కారణాన పంటలు పండకపోతే పట్వారీ నివేదిక ఆధారంగా ‘జమాబందీ’ జరిగినప్పుడు శిస్తు మాఫీ చేసేవారు. అలాగే చెరువులో నీళ్లు ఉన్నప్పుడు, రెండవ పంటకు నీరు ఇవ్వాలా-వద్దా? అనే విషయం ‘తహబందీ’ ద్వారా నిర్ణయించేవారు.


వ్యవసాయ భూముల యాజమాన్య వివరాలు, శిస్తు వివరాలు రికార్డు చేయడం పట్వారీ ప్రధాన బాధ్యత. ఆయన తయారుచేసిన రికార్డులే ప్రభుత్వానికి ఆధారం. సాలార్‌జంగ్ సంస్కరణల్లో భాగంగా భూములను కొలిపించి, ఒక విధంగా చెప్పాలంటే, ఈ నాటి కంప్యూటర్ వ్యవస్థకు అనుకూలంగా రికార్డులు తయారు చేయించారు. కాకపోతే అవి ఇప్పుడు రకరకాల కారణాల వల్ల మరో సర్వే-సెటిల్మెంటు చేయించాల్సిన పరిస్థితులకు దారితీశాయి. అలనాటి సర్వే నంబర్లు కూడా ఇప్పుడు పనికొచ్చే విధంగా లేవు.


అప్పట్లో సర్వే జరిగాక ప్రతి రైతు వ్యవసాయం చేసుకునే భూమి వివరాలన్నీ ఒక శాశ్వత రిజిస్టర్ గా వ్యవస్థీకరించారు. దాన్నే ‘సేత్వార్’ అనేవారు. ప్రతి భూ కమతానికి నంబర్లు ఇచ్చారు. వాటినే సర్వే నంబర్లు అంటున్నాం. వీటి ఆధారంగా ప్రతి సంవత్సరం పట్వారీ రెండు ముఖ్యమైన రిజిస్టర్లు రాసేవాడు. ఒకటి ‘పహాణీ’, మరొకటి ‘చౌఫస్లా’. వీటిని రాసి ప్రతి పేజీ మీద చివర్లో తహసీల్ ముద్ర వేయించేవాడు. పంటల ఇన్‌స్పెక్షన్ వివరాలను పహాణీలోనే పట్వారీ, గిర్దావర్ రాసేవారు. వీటి ఆధారంగా జమాబందీలో శిస్తు నిర్ణయించేవారు. 


‘పహాణీ’ అనేది ఒక రకమైన ప్రాథమిక హక్కు పత్రం. శిస్తు వసూలుకు ప్రాతిపదిక అయిన రికార్డు. పట్వారీ నాలుగు నెలలకు చేసే తనిఖీని ‘చారుమాహీ’ తనిఖీ అనేవారు. ఆ తరువాత చేసే దానిని ‘హస్త్ మాయి’ అనేవారు. తనిఖీల పర్యవేక్షకుడు గిర్దావర్. జమాబందీ నిర్ణయం ప్రకారం శిస్తు నిర్ణయం జరిగేది. పట్టేదారు చనిపోయినప్పుడు వారసత్వ మార్పిడి కూడా జమాబందీలో అంతర్భాగమే. జమాబందీ ఆధారంగా ‘పైసల్ పట్టీ’ తయారయ్యేది. ప్రతీ సంవత్సరం దసరానాడు పట్వారీ రెవెన్యూ రికార్డులను ఆరంభించడానికి పూజలు చేసేవాడు. రికార్డులు భద్రపరిచే వస్త్రం చేనేతది.


కాలక్రమంలో వతన్‌దారీ వ్యవస్థ రద్దయింది. నూతన అధికారగణం ఏర్పాటైంది. గ్రామ రికార్డుల్లో అనేకమైన లోటుపాట్లు జరగడం మొదలయింది. రైతులకు–-గ్రామాధికారులకు మధ్య అగాధం ఏర్పడింది. గ్రామాల్లో ఎవరి భూమి ఎంతో, అనే వివరాలు సరిగ్గా చెప్పే నాథుడు లేడు. అవినీతి పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో వచ్చిందే నూతన రెవెన్యూ చట్టం. వీఆర్‌ఓ వ్యవస్థ రద్దయింది. 


భవిష్యత్‌లో చేపట్టనున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత చారిత్రాత్మక సర్వే–-సెటిల్మెంట్ సాలార్‌జంగ్ సంస్కరణల కంటే మిన్నగా ఉంటుందని భావించవచ్చు. డిజిటల్ సర్వే కాబట్టి తప్పొప్పులకు ఆస్కారం ఉండే అవకాశం లేదు. గ్రామ వ్యవసాయ, -వ్యవసాయేతర భూముల రికార్డులన్నీ పూర్తిగా ప్రక్షాళన జరిగి, శాశ్వతంగా, రైతు ప్రాతిపదికన సర్వే నంబర్లుండే విధానానికి శ్రీకారం చుడతామని, భవిష్యత్‌లో ఏ విధమైన తగాదాలకు ఆస్కారం లేకుండా ఈ రికార్డులు ఉంటాయని ముఖ్యమంత్రి చెప్పారు. వతన్‌దారీ విధానం రద్దు దరిమిలా అస్తవ్యస్తమైన గ్రామీణ పాలనావ్యవస్థ పటిష్టం కాబోతోంది అనుకోవాలి. కేసీఆర్ చేపడుతున్న సర్వే-సెటిల్మెంట్ మరో భూసంస్కరణలకు నాంది పలికి రైతుల భూమికి కంక్లూజివ్ టైటిల్ ఇవ్వడం దిశగా చేపట్టిన ప్రస్తానం విజయవంతం అవుతుందని, తద్వారా గ్రామీణ భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లభించి వ్యవసాయాభివృద్ధి జరుగుతుందని ఆశిద్దాం. 

వనం జ్వాలా నరసింహారావు 

Updated Date - 2020-09-15T06:08:34+05:30 IST