సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమైన ప్యాకేజీ

ABN , First Publish Date - 2020-05-28T07:49:33+05:30 IST

ప్రస్తుతం యావద్భారత దేశం ఇరుక్కుపోయిన ప్రత్యేక సందర్భం, రెండు శతాబ్దాల క్రితం ఆంగ్లేయ వేదాంతి, కవి, జాన్ హెన్రీ న్యూమెన్ రచించిన ‘ద పిల్లర్ ఆఫ్ ద క్లౌడ్’ అనే కవితలోని మొదటి పాదంలోని ‘‘లీడ్ కైండ్లీ లైట్’’ పదాలు గుర్తుకొస్తున్నాయి...

సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమైన ప్యాకేజీ

కేంద్రం రాష్ట్రాలకు 3.5% నుండి 4.5% వరకూ పెంచిన ఋణపరిమితి అనేక షరతులతో కూడి ఉన్నందున అది సహకార సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. అదీ ఇదీ సాధిస్తేనే ఋణపరిమితి పెరుగుతుందని చెప్తూనే, పరిమితిని పెంచాం అని చెప్పడం కేవలం కంటి తుడుపు మాత్రమే. ఇప్పుడున్న పరిస్థితులలో, ఈ క్లిష్ట సంవత్సరంలో, కేంద్రం చెప్పిన మైలు రాళ్లను అధిగమించడం ఏ రాష్ట్రానికైనా అసాధ్యమే. పైగా ఇలాంటి పలచబడ్డ సౌకర్యం ఈ ఒక్క సంవత్సరానికి మాత్రమే కదా! 


ప్రస్తుతం యావద్భారత దేశం ఇరుక్కుపోయిన ప్రత్యేక సందర్భం, రెండు శతాబ్దాల క్రితం ఆంగ్లేయ వేదాంతి, కవి, జాన్ హెన్రీ న్యూమెన్ రచించిన ‘ద పిల్లర్ ఆఫ్ ద క్లౌడ్’ అనే కవితలోని మొదటి పాదంలోని ‘‘లీడ్ కైండ్లీ లైట్’’ పదాలు గుర్తుకొస్తున్నాయి. ‘‘చుట్టూతా అలుముకుంటూ కమ్ముకుంటున్న చీకట్ల మధ్యన సుదూరంలో వున్న దృశ్యాన్ని చూడమని అడగడం లేదు, ఒకే ఒక్క అడుగు వేస్తే సరిపోతుంది నాకు, నన్ను దయతో ఆ అడుగు తేలికగా నడిపించండి’’ అని దాని అర్థం.


మే 12న ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. కరోనా వైరస్ మహమ్మారి కనీవినీ ఎరుగని ఒక సంక్షోభం అని ఉద్ఘాటిస్తూ, ఎకానమీ, మౌలిక సదుపాయాలు, వ్యవస్థ, శక్తివంతమైన జనాభా, డిమాండ్ అనే ఐదు స్తంభాల ఆధారంగా ఒక స్వావలంబన భారతదేశాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఆ తరువాత ఆయన ఉహించుకున్న స్వావలంబన భారత దేశం, లేదా, ‘ఆత్మనిర్భర్ భారత్’ను సాధించేందుకు భారీస్థాయిలో రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. భారత స్థూల దేశీయ ఉత్పత్తిలో ఇది దాదాపు 10% వుంటుంది. సంఘటిత, అసంఘటిత రంగంలోని పేద ప్రజల, కార్మికుల, వలసదారుల లాంటి వారి సాధికారికత మీద ఈ ప్యాకేజీ సమగ్ర దృష్టి సారిస్తుందని ప్రధాని చెప్పారు. ప్రధాని తన సందేశంలో పేర్కొన్న విధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆ మర్నాటి నుండి, ఐదు రోజుల పాటు, వరుస పత్రికా సమావేశాలను ఏర్పాటు చేసి, ప్యాకేజీ వివరాలను వెల్లడి చేశారు. 


మొదటి రోజు ఆర్థిక మంత్రి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలు (ఎమ్మెస్ఎంయీలు) మనుగడ సాగించడానికి, కరోనా వైరస్ మహమ్మారి మూలాన వాటికి సంభవించిన ఆర్థిక దుష్ప్రభావాన్నుండి కోలుకోవడానికి రాయితీలు ప్రకటించారు. మర్నాడు, వలస కార్మికులకు ఉచిత ఆహారధాన్యాల సరఫరాకు, రైతులకు రాయితీ క్రెడిట్, వీధి వర్తక వ్యాపారులకు వర్కింగ్ కాపిటల్ ఋణ సౌకర్యం, ఆర్థిక ఉద్దీపనలో రెండో భాగంగా ప్రకటించారు. ఇక మూడో రోజున, వ్యవసాయ సంబంధిత మౌలిక సదుపాయాల లాజిస్టిక్స్ బలోపేతానికి; వివిధ రంగాలలో సామర్థ్య పెంపుదలకు; వ్యవసాయం, మత్స్య సంపద, ఆహార శుద్ధి రంగాలలో పరిపాలనా సంస్కరణల అమలుకు, ఆయా రంగాల బలోపేతానికి చర్యలను ప్రకటించారు. బొగ్గు, ఖనిజాలు, రక్షణ, పౌర విమానయానం, విద్యుత్ సరఫరా, సామాజిక మౌలిక సదుపాయాలు, అంతరిక్ష పరమాణు శక్తి రంగాలలో నిర్మాణాత్మక సంస్కరణలకు సంబంధించి ప్యాకేజీ వివరాలను నాలుగో రోజున ప్రకటించారు. చివరి రోజున ఏడు అంశాలను ప్రాధాన్యతలుగా, ప్రాధాన్యతా రంగాలుగా ప్రకటించారు. అవి వరుసగా: మహాత్మా గాంధి జాతీయ గ్రామీణ ఉపాధి పథకం, ఆరోగ్యం, విద్య, వాణిజ్యం కొవిడ్ 19, కంపెనీ చట్టాన్ని చట్టబద్ధం చేయడం, సులభతర వాణిజ్యం, ప్రభుత్వ రంగ సంస్థలు-రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతు. 


రాష్ట్రాల రుణపరిమితిని పెంచుతూ కొంత ఆశ కలిగిస్తూనే, ఆ పరిమితికి అనేక నిబంధనలు, షరతులు విధించారు ఆర్థిక మంత్రి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కనీ వినీ ఎరుగని విధంగా ఆ మహమ్మారి ప్రభావం వుండడం వల్ల, రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు, 2020-–21 ఆర్థిక సంవత్సరానికి మాత్రమే, వాటి ఋణపరిమితిని ఇప్పుడున్న 3%నుండి 5%కి పెంచి, తద్వారా, అదనంగా రూ.4.28 లక్షల కోట్ల ఋణ సౌకర్యం పొందడానికి, వనరుల సేకరణకు వీలు కలిగించారు. కాకపోతే రాష్ట్రాలకు అనుమతించిన ఈ ఋణపరిమితి సౌకర్యాన్ని, సౌలభ్యాన్ని కేంద్రం ప్రకటించిన నిర్దిష్ట సంస్కరణలకు అనుసంధానం చేసింది. 3% నుండి 3.5% అంటే 0.5% పెంపుదల భేషరతుగా వుంటుంది. తరువాత 1% నాలుగు అంచెలుగా, ఒక్కోటి 0.25% వుండే విధంగా, కేంద్రం ప్రకటించిన సంస్కరణల అమలుకు ముడి వేసింది. చివరి 0.5% పొందాలంటే, కేంద్రం ప్రకటించిన నాలుగు అంశాలలో కనీసం మూడింటిలో నిబంధనల మేరకు మైలు రాళ్లను అధిగమించాలి. ఇన్ని షరతులతో కూడిన ఋణ పరిమితి నామ మాత్రమే అని పరిశీలకుల అభిప్రాయం.


రెవెన్యూ మిగులు రాష్ట్రాలైన గుజరాత్, తెలంగాణలకు ఇప్పటికే ఎఫ్ఆర్బీఎం ఋణ పరిమితి భేషరతుగా 3.5% వుంది. ఇప్పుడు కొత్తగా ఒరిగేదేమీ లేదు. ఇకపోతే, 3.5% నుండి 4.5% వరకూ పెంచిన ఋణపరిమితి అనేక షరతులతో కూడి ఉన్నందున అది సహకార సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. అదీ ఇదీ సాధిస్తేనే ఋణపరిమితి పెరుగుతుందని చెప్తూనే, పరిమితిని పెంచాం అని చెప్పడం కేవలం కంటి తుడుపు మాత్రమే. ఇప్పుడున్న పరిస్థితులలో, ఈ క్లిష్ట సంవత్సరంలో, కేంద్రం చెప్పిన మైలు రాళ్లను అధిగమించడం ఏ రాష్ట్రానికైనా అసాధ్యమే. పైగా ఇలాంటి పలచబడ్డ సౌకర్యం ఈ ఒక్క సంవత్సరానికి మాత్రమే కదా!


ఇంకొక విషయం: ఈ ప్యాకేజీ ప్రకటనలన్నీ కొత్తగా చెప్తున్న మాటలేమీ కాదు. ఇవన్నీ ఒక విధంగా బడ్జెట్‍లో చెప్పిన పలుకులే. దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు, సామాన్య సగటు మనిషి జీవిక అస్తవ్యస్తమైపోయిన తరుణంలో ఈ ఉద్దీపన ప్యాకేజీలో ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. భారత ఆర్థిక వ్యవస్థ మీద, యావత్తు భారతీయుల మీద నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ వివరాలు ఒక పెద్ద జోక్‍గా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వర్ణించారు. స్వావలంబన అంటే.. అప్పుల మీద, పెరుగుతున్న బాధ్యతల మీద, తక్కువ పొదుపు చేసి ఎక్కువ వ్యయం చేయడం మీద ఔత్సాహికులు ఆధారపడేట్లు చేసి, వారికేదో మద్దతు ఇస్తున్నామని ప్రకటించడం కాదు. 


ఏదైతేనేం... ఉద్దీపన ప్యాకేజీ మొత్తాన్ని రూ.20 లక్షల కోట్లగా ప్రకటించింది కేంద్రం. దీంట్లో సింహభాగం బాంకుల ద్వారా, ఋణ పద్ధతిలో, ఎంఎస్ఎంయీ లకు, వ్యవసాయానికి, పరిశ్రమలకు, తదితర రంగాలకు లభిస్తుంది. రెట్టింపు లెక్కింపు, అంటే లెక్కించిన నగదునే మళ్లీమళ్లీ లెక్కించే ప్రమాదం వుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. రాష్ట్రాలకు ఇచ్చిన ప్యాకేజీ పూర్తిగా నిరుత్సాహభరితంగా వుంది. కీలక, ప్రాధాన్యతారంగమైన ఆరోగ్యానికి కేంద్రం ఇచ్చిన మద్దతు అంతంత మాత్రమే. రాష్ట్రాలకు నేరుగా ఎలాంటి నిధులను ప్రతిపాదించలేదీ ప్యాకేజీలో. వాస్తవానికి రాష్ట్రాలకు మొత్తంగా ఇచ్చింది కేవలం రూ.4000కోట్ల లోపే! సహకార సమాఖ్య స్ఫూర్తి పూర్తిగా లోపించింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో భారత సహకార సమాఖ్య వ్యవస్థలో కేంద్రం అవలంబించాల్సిన కీలక ఫెడరల్ విధానం ఇది కానే కాదు. 


ప్రజల విశ్వాసం పొందడం, వారిలో నమ్మకం కలిగించడం అనేది ఒక కళ, ఒక శాస్త్రం, ఒక రకమైన నాయకత్వ లక్షణం, అది అందరికీ చేతకాదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పత్రికా సమావేశం వుందంటే, ఆయన మళ్లీ మళ్లీ మాట్లాడాలని, మళ్లీ మళ్లీ వినాలని ఎంతోమంది ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారు. దానికి కారణం లేకపోలేదు. ఆయన మాటలకు వారంతా ప్రభావితమౌతారు. ఉత్సాహపడతారు, స్ఫూర్తి పొందుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్లు కోరుకున్నది ఆయన నోటి వెంట వస్తుంది. అదే ప్రేక్షకులు ప్రధాని మోదీ ద్వారా, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లాస్ రూమ్ లెక్చర్ల ద్వారా ప్రకటిస్తున్న ఆర్థిక ప్యాకేజీ విని విసుగు చెందారు. ఈ క్లిష్ట సమయంలో, ఆపత్కాలంలో ప్రజలకు కావాల్సింది ఒకింత సేద, ఓదార్పు, నాలుగు మంచి మాటలు, ధైర్యం. ఇదే చెప్పాడు వేదాంతి, రచయిత జాన్ హెన్రీ న్యూమెన్ తన ‘‘లీడ్ కైండ్లీ లైట్’’ వాక్యాల ద్వారా.

వనం జ్వాలానరసింహారావు

Updated Date - 2020-05-28T07:49:33+05:30 IST