శనగలో కొత్త వంగడం.. ఎన్బీఈజీ-776
ABN , First Publish Date - 2022-08-06T09:17:22+05:30 IST
శనగలో కొత్త వంగడం.. ఎన్బీఈజీ-776
అభివృద్ధి చేసిన నంద్యాల ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలు
నంద్యాల టౌన్, ఆగస్టు 5: అధిక దిగుబడిని ఇస్తూ... మిషన్ కోతకు అనుకూలమైన కొత్త రకం శనగ వంగడాన్ని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (ఆర్ఏఆర్ఎస్) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ కొత్త వంగడం ఎన్బీఈజీ-776... ఈ వ్యవసాయ సీజన్లోనే రైతులకు అందుబాటులోకి రానున్నది. ఆర్ఏఆర్ఎ్సలో శనగ ప్రధాన శాస్త్రవేత్త వి.జయలక్ష్మి నేతృత్వంలో పప్పుధాన్యాల పరిశోధన శాస్త్రవేత్తల బృందం ఆధ్వర్యంలో ఈ దేశవాలీ రకం ఎన్బీఈజీ-776కి రూపకల్పన జరిగింది. వర్షాధారంలో ఈ కొత్త వంగడాన్ని సాగు చేస్తే 90-105 రోజుల్లో దిగుబడి వస్తుంది. ఒకటి, రెండు తడులు పెడితే చాలు.. ఎకరానికి 10-12 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. మిషన్ కోతకు అనుకూలంగా ఉండటంతోపాటు ఎండు తెగులును సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఈ ఎన్బీఈజీ-776 కొత్త వంగడాన్ని ఈ సీజన్లోనే విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చిన వెంటనే రైతులకు విత్తనాన్ని అందిస్తారు.