కోవిడ్-19 రోగుల రక్త నమూనాలను లాక్కెళ్ళిన కోతి
ABN , First Publish Date - 2020-05-30T00:23:56+05:30 IST
ఉత్తర ప్రదేశ్లోని మీరట్లో ఓ కోతి అత్యంత ప్రమాదకరమైన చర్యకు పాల్పడింది.
లక్నో : ఉత్తర ప్రదేశ్లోని మీరట్లో ఓ కోతి అత్యంత ప్రమాదకరమైన చర్యకు పాల్పడింది. మీరట్లోని లాలా లజపతిరాయ్ వైద్య కళాశాల ల్యాబ్ టెక్నీషియన్ నుంచి శుక్రవారం కోవిడ్-19 రోగుల రక్త నమూనాలను లాక్కెళ్ళింది.
రక్త నమూనాతో కూడిన ఓ తెల్లని పొట్లాన్ని ఆ కోతి నములుతున్న దృశ్యం ఓ వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఎస్కే గార్గ్ మాట్లాడుతూ, ఈ సంఘటన తమ దృష్టికి వచ్చిందన్నారు. తాము ల్యాబ్ టెక్నీషియన్ను వివరాలు అడిగామన్నారు. కోతి పట్టుకెళ్ళినవి గొంతు, నాలుకకు సంబంధించిన స్వాబ్ శాంపిల్స్ కావని, అవి రొటీన్ ట్రీట్మెంట్లో భాగంగా కోవిడ్-19 రోగుల నుంచి సేకరించిన రక్త నమూనాలని తెలిపారు. కోవిడ్-19 శాంపిల్స్ను ఓ పెట్టెలో భద్రపరిచారని, వీటిని ఆ విధంగా చేయలేదని వివరించారు.
కోతుల ద్వారా కోవిడ్-19 వ్యాపిస్తుందనే భయాందోళన అక్కర్లేదని వైద్యాధికారులు భరోసా ఇచ్చారు.
జంతువుల నుంచి కోవిడ్-19 వ్యాపిస్తున్నట్లు సాక్ష్యాధారాలు లేవని గార్గ్ తెలిపారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళనకు గురికానక్కర్లేదని స్పష్టం చేశారు.