18 ఏళ్ల తరువాత భార్యను చూద్దామని గ్రామానికి రాగానే....
ABN , First Publish Date - 2020-05-23T12:14:42+05:30 IST
18 సంవత్సరాల క్రితం కోపంతో ఇంటి నుండి వెళ్లిపోయిన మహంగీ ప్రసాద్ ప్రస్తుత లాక్డౌన్లో ముంబై నుండి ఇంటికి తిరిగి వచ్చాడు.
తర్కులవా(యూపీ): 18 సంవత్సరాల క్రితం కోపంతో ఇంటి నుండి వెళ్లిపోయిన మహంగీ ప్రసాద్ ప్రస్తుత లాక్డౌన్లో ముంబై నుండి ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే అంతకుముందే అతని తల్లి, భార్య కన్నుమూశారని తెలుసుకుని కుమిలిపోతున్నాడు. మహంగీ ప్రసాద్ తన తల్లి, భార్య, మూడేళ్ల కుమార్తెను విడిచిపెట్టి ముంబై వెళ్లిపోయాడు. ఆ సమయంలో అతనికి 40 ఏళ్లు. ముంబైలో తొలుత ఏవో చిన్నాచితకా పనులు చేశాడు, తరువాత ఒక చిన్న ఫ్యాక్టరీలో కాపలాదారుగా చేరాడు. ముంబైకి వచ్చిన ప్రసాద్ తిరిగి గ్రామంవైపు ఎప్పుడూ వెళ్లలేదు. కుటుంబ సభ్యులు అతని కోసం ఎంత వెదికినా ప్రయోజనం లేకపోవడంతో చనిపోయాడని భావించారు. అయితే ఇప్పుడు కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోవడంతో ఇంటికి తిరిగి వెళ్లిపోవాలనుకున్నాడు. అనుకున్నవిధంగానే రూ. 3500లు చెల్లించి ఒక లారీలో గోరఖ్పూర్ చేరుకుని, ఆపై కాలినడకన ఇంటికి వచ్చాడు. తన తల్లి, భార్య ఇంతకుముందే మృతి చెందారని తెలిసి ఎంతో బాధపడ్డాడు. అయితే ప్రస్తుతం అదే ఇంట్లో ఉన్న కుమార్తె తన తండ్రి ఇంతకాలానికి తిరిగి రావడంతో ఆశ్చర్యపోయింది. ఇప్పుడు మహంగీ ప్రసాద్ తన కుమార్తె, అల్లుడితో పాటు ఉండాలని నిర్ణయించుకున్నాడు.