Unique protest: రోడ్ల దుస్థితిపై వినూత్న నిరసన... మురికి నీటితో స్నానం, నీటి గుంతల్లో యోగా...
ABN , First Publish Date - 2022-08-10T17:43:37+05:30 IST
కేరళలోని మళప్పురం (Malappuram)లో రోడ్లు అత్యంత
తిరువనంతపురం : కేరళలోని మళప్పురం (Malappuram)లో రోడ్లు అత్యంత దయనీయంగా ఉన్నాయి. రోడ్లపై ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గోతులు, వాటిలో నిండా నీళ్లు ఉన్నాయి. ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వాహనదారుల బాధలు వర్ణనాతీతం. ఈ దుస్థితిని చూసి, చలించిపోయిన ఓ వ్యక్తి మురికి నీటితో స్నానం (Mud bath) చేస్తూ, నీటి గుంతల్లో యోగాభ్యాసం (Yoga) చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు.
హమ్జా పొరలి (Hamza Porali) అనే వ్యక్తి స్థానిక ఎమ్మెల్యే యూఏ లతీఫ్ )UA Latheef) సమక్షంలో రోడ్ల దుస్థితిపై తన నిరసనను తెలిపారు. రోడ్లపై పడిన పెద్ద పెద్ద గోతులు వర్షపు నీటితో నిండిపోయి, ప్రజలకు అనేక సమస్యలను సృష్టిస్తున్నాయని, వాటిని మరమ్మతు చేయించాలని కోరారు. ఈ గోతుల్లోని వర్షపు నీటితో స్నానం చేసి, ఆ గోతుల్లోనే యోగాభ్యాసం చేసి, ఆ నీటితోనే బట్టలు ఉతికి నిరసన తెలిపారు. నీటిలో నిలబడి, కూర్చుని వివిధ రకాల యోగాసనాలు వేశారు.
కేరళలో రోడ్ల దుస్థితిపై గత వారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. కానీ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. రాజకీయ నాయకులు కూడా స్పందించలేదు. ఎర్నాకుళం జిల్లాలోని నెడుంబస్సెరి జాతీయ రహదారిపై ఉన్న ఓ నీటి గుంత (pothole)లో 52 ఏళ్ళ వ్యక్తి పడిపోయారు. ఆయనపై నుంచి ఓ వాహనం దూసుకెళ్ళడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు.
భారత జాతీయ రహదారుల సంస్థ పరిధిలోని రోడ్లను మరమ్మతు చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆ సంస్థను కేరళ హైకోర్టు (Kerala High court) ఇటీవల ఆదేశించింది. ఓ వారం రోజుల్లోపునే మరమ్మతు చేయాలని ఆదేశించింది.