Flipkart Big Billiondaysలో దారుణం.. రూ.52వేల ఫోన్ ఆర్డర్.. అందులో వచ్చింది చూసి బిత్తరపోయిన కస్టమర్
ABN , First Publish Date - 2021-10-12T16:19:11+05:30 IST
ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్.. పండుగల నేపథ్యంలో ఇండియాలో బిగ్ బిలియన్ డేస్ను ప్రకటించింది. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్, హోమ్ అప్లయన్సెస్పై భారీ డిస్కౌంట్లు ఉంటాయ
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్.. పండుగల నేపథ్యంలో ఇండియాలో బిగ్ బిలియన్ డేస్ను ప్రకటించింది. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్, హోమ్ అప్లయన్సెస్పై భారీ డిస్కౌంట్లు ఉంటాయని వెల్లడించడంతో.. దేశంలోని చాలా మంది ఎప్పుడెప్పుడు బిగ్ బిలియన్ డేస్ స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూశారు. ఈ క్రమంలోనే ఫ్లిప్కార్ట్.. ఈ నెల 3 నుంచి 10 వరకూ బిగ్ బిలియన్ డేస్ సేల్ను నిర్వహించింది. అంతేకాకుండా ముందుగా చెప్పినట్టే మొబైల్స్ తదితరలపై పెద్ద మొత్తంలో డిస్కౌంట్ ప్రకటించింది. ఈ క్రమంలో ఐఫోన్ 12.. కేవలం రూ. 51,999లకే లభించడంతో ఓ కస్టమర్ దాన్ని ఆర్డర్ చేశాడు. ఆర్డర్ చేసిన తర్వాత రోజుల వ్యవధిలోనే ఇంటికొచ్చిన పార్శల్ను ఉత్సాహంగా ఓపెన్ చేశాడు. తీరా పార్శల్ ఓపెన్ చేసిన అతడు.. ఐఫోన్కు బదులు అందులో వచ్చిన దాన్ని చూసి ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఇంతకూ పార్శల్లో ఏముందనే వివరాల్లోకి వెళితే..
సిమ్రాన్పాల్ సింగ్ అనే వ్యక్తి ఎప్పటి నుంచో ఐఫోన్ను కొనుగోలు చేయాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ను ప్రకటించడం.. అందులో మొబైల్స్పై భారీ డిస్కౌంట్ ఉంటుందని ప్రకటించడంతో బిగ్ బిలియన్ డేస్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూశాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 3 నుంచి బిగ్ బిలియన్ డేస్ మొదలవడం.. ఐఫోన్ 12 మొబైల్ కేవలం రూ. 51,999కే అందుబాటులోకి రావడంతో అతడు దాన్ని ఆర్డర్ చేశాడు. దీంతో ఫ్లిప్కార్ట్.. తన డెలివరీ పార్ట్నర్తో ఐఫోన్ పార్శల్ చేసి అతడికి పంపించింది. ఆర్డర్ చేసిన రెండు మూడు రోజుల్లోనే పార్శల్ రావడంతో అతడు ఎంతో సంతోష పడ్డాడు. తన కలల ఫోన్ను చూసేందుకు ఉత్సాహంగా పార్శల్ను ఓపెన్ చేశాడు.
అనంతరం అందులో ఉన్న వాటిని చూసి అతడు కంగుతిన్నాడు. ఐఫోన్కు బదులు.. రూ.5 విలువైన రెండు నిర్మా బట్టల సబ్బలు పార్శల్లో ఉండటంతో సిమ్రాన్ సింగ్ షాక్ అయ్యాడు. వెంటనే కస్టమర్ కేర్ ఫోన్ ద్వారా కస్టమర్ కేర్కు సమాచారం అందించాడు. పార్శల్ ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీసినట్టు చెప్పడంతో.. రూ.51,999లను తిరిగి అతడి అకౌంట్లో జమ చేస్తామని హామీ ఇచ్చింది. కాగా.. సిమ్రాన్పాల్ సింగ్ పొందిన అనుభవం తాలూకూ వీడియో ఓ యూట్యూబ్ చానల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్గా మారింది. దీంతో స్పందిస్తున్న కస్టమర్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం ఇది కొత్తేమీ కాదు.