గోపాలపురంలో యువకుడి దారుణ హత్య

ABN , First Publish Date - 2022-01-18T07:28:47+05:30 IST

పెళ్లి కుదిరింది... వచ్చే నెల 16న ముహూర్తం కూడా పెట్టుకున్నారు.

గోపాలపురంలో యువకుడి దారుణ హత్య
హత్యకు గురైన రాము (పాత చిత్రం)

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ మాధవరెడ్డి కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడి

రావులపాలెం రూరల్‌, జనవరి 17: పెళ్లి కుదిరింది... వచ్చే నెల 16న ముహూర్తం కూడా పెట్టుకున్నారు. తానొక ఇంటివాడినవుతున్నానని బంధువులు, స్నేహితులు అందరికీ చెప్పుకుని ఎంతో ఆనందంగా వున్నాడు. ఇంతలో ఏం జరిగిందో ఏమో పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఆ యువకుడు అకస్మాత్తుగా హత్యకు గురయ్యాడు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రావులపాలెం మండలం గోపాలపురానికి చెందిన అంబటి రాము (శ్యామ్‌) (30) వంటలు చేస్తుంటాడు. బుధవారం ఇతని మృతదేహం గోదావరి ఏటిగట్టు సమీపంలోని డంపింగ్‌ యార్డుకు కూతవేటు దూరంలో పడి ఉన్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. సీఐ వెంకటనారాయణ, ఎస్‌ఐ భానుప్రసాద్‌, సిబ్బందితో సంఘటనా ప్రాంతానికి చేరుకుని పరిశీలించి ఆ యువకుడిని రాముగా గుర్తించి ఎవరో హత్య చేశారని నిర్ధారణకు వచ్చారు. విషయం తెలుసుకున్న అమలాపురం డీఎస్పీ వై.మాధవరెడ్డి హత్య జరిగిన ప్రాంతానికి వచ్చి మృతదేహా న్ని పరిశీలించారు. ఎవరో గుర్తు తెలియని వారు మృతుడి తలపై బలంగా కొట్టి చంపినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలిలో ఒక మోటారు సైకిలు పడి ఉంది. హత్యకు దారితీసిన కారణాలు, ఎవరు చేశారనేది తేలాల్సి ఉందన్నారు. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యా ప్తు చేపడుతున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఇప్పటికే క్లూస్‌టీమ్‌ను రప్పించి వివరాలు నమోదు చేసుకున్నారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని కొత్తపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ వివరించారు. 

సంక్రాంతి సందర్భంగా ముందురోజు వరకు అందరితోనూ సరదాగా గడిపిన రాము హత్యకు గురికావడంతో అతడి బంధువులు, స్నేహితులు రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. రాము ఇంట విషాదఛాయలు అల ముకున్నాయి. పండుగ ఆనందంలో ఉండగా ఈ ఘటన జరగడంతో మృతుని ఇంటి సమీపంలోని వారితో పాటు ఆ గ్రామస్తులంతా భయభ్రాంతులకు గురయ్యారు.

Updated Date - 2022-01-18T07:28:47+05:30 IST