బాబోయ్.. కిడ్నీ‌లో అన్ని రాళ్లా.. ఎలా భరించావయ్యా!

ABN , First Publish Date - 2022-05-24T01:12:04+05:30 IST

మాములుగా మనిషి కిడ్నీలో ఒకటి రెండు రాళ్లు వస్తేనే తట్టుకోలేరు. అలాంటి ఓ వ్యక్తి కిడ్నీలో ఏకంగా 206 రాళ్లు ఉన్నాయి. అయితే అసలు విషయం తెలియని అతడు ఇంత కాలం నొప్పిని అలాగే భరిస్తూ వచ్చాడు

బాబోయ్.. కిడ్నీ‌లో అన్ని రాళ్లా.. ఎలా భరించావయ్యా!

ఇంటర్నెట్ డెస్క్: మాములుగా మనిషి కిడ్నీలో ఒకటి రెండు రాళ్లు వస్తేనే తట్టుకోలేరు. అలాంటి ఓ వ్యక్తి కిడ్నీలో ఏకంగా 206 రాళ్లు ఉన్నాయి. అయితే అసలు విషయం తెలియని అతడు ఇంత కాలం నొప్పిని అలాగే భరిస్తూ వచ్చాడు. ఇటీవల నొప్పి మరింత ఎక్కువవడంతో కుటుంబ సభ్యులు వైద్యులను సంప్రదించారు. పేషెంట్‌ను పరిశీలించిన అనంతరం కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు స్పష్టం చేశారు. దీంతో పేషెంట్ సహా అతడి కుటుంబ సభ్యులు షాకయ్యారు. అయితే వైద్యులు గంట పాటు ఆపరేషన్ చేసి విజయవంతంగా రాళ్లను తొలగించారు. ఈ ఘటన ఎక్కడో కాదు హైదరాబాద్‌లోనే జరిగింది. 



నల్లగొండకు చెందిన వీరమల్ల రామలక్ష్మయ్య గత కొన్ని నెలలుగా నొప్పితో బాధపడుతున్నాడు. ఈ మధ్య నొప్పి తీవ్రమవడంతో కుటుంబసభ్యులు ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు తెలిపారు. కచ్చితంగా వాటిని తొలగించాలని... ఈ విషయం పేషెంట్‌కు, బంధువులకు తెలిపారు. అందుకు వారు కూడా అంగీకరించడంతో వైద్యులు ఆపరేషన్ మొదలుపెట్టారు. కీ హోల్‌ శస్త్ర చికిత్స చేసి గంట వ్యవధిలోనే కిడ్నీలో ఉన్న 206 రాళ్లను తొలగించారు. అనంతరం రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న రామ లక్ష్మయ్యను డిశ్చార్జి చేశారు. వేసవిలో డీహైడ్రేషన్‌ సమస్య అధికంగా ఉంటుందని, ఎండలో అధికంగా తిరగడం కారణంగా రాళ్లు ఏర్పడతాయన్నారు. నీరు, పండ్ల రసాలు అధికంగా తీసుకోవాలని వైద్యులు సూచించారు. నీటి శాతం తక్కువ అయితే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయని చెప్పారు. ఎండలో అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని.. శీతల పానీయాల జోలికి పొవద్దని వైద్యులు సలహా ఇచ్చారు. మీరు ఎండాకాలం దృష్ట్యా డీహైడ్రేట్‌కు గురికాకుండా అరగంటకొకసారి నీటిని తాగుతూ ఉండండి.. మీ శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేట్‌లోనే ఉంచుకోండి.




Updated Date - 2022-05-24T01:12:04+05:30 IST