భారత్‌లో వాట్సప్‌ను నిషేధించండి.. హైకోర్టులో పిటిషన్!

ABN , First Publish Date - 2021-06-23T22:08:53+05:30 IST

భారత్‌లో కొత్తగా అమల్లోకి వచ్చిన సోషల్ మీడియా నిబంధనలను సవాల్ చేస్తున్న వాట్సాప్‌ను నిషేధించాలని

భారత్‌లో వాట్సప్‌ను నిషేధించండి.. హైకోర్టులో పిటిషన్!

భారత్‌లో కొత్తగా అమల్లోకి వచ్చిన సోషల్ మీడియా నిబంధనలను సవాల్ చేస్తున్న వాట్సాప్‌ను నిషేధించాలని కోరుతూ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కేరళ హైకోర్టులో బుధవారం పిటిషన్ వేశాడు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించాలని కేరళలోని ఇడుక్కికి చెందిన ఒమన కుట్టన్ పిటిషన్‌లో పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యే మెసేజ్‌ల ఆరిజన్ క్రియేటర్ (మేసేజ్‌ను రూపొందించిన వ్యక్తి)ను గుర్తించాలని కొత్త చట్టం చెబుతోంది. 


తప్పు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి వివరాలను మాత్రమే అందివ్వాలని చట్టం చెబుతోంది. `వాట్సాప్ మెస్సేజ్‌లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్‌గా ఉంటాయి. ఇందులో కంటెంట్ పంపిన వారితో (ఆరిజినేటర్స్) పాటు, రిసీవర్ల ఎన్క్రిప్షన్‌ కూడా భాగంగా ఉంటుంది. అందువల్ల ఆరిజినేటర్స్ వివరాలతో పాటు రిసీవర్ల ఎన్‌క్రిప్షన్‌ను కూడా బ్రేక్ చేయాల్సి వస్తుంద`ని వాట్సాప్ చెబుతోంది. ఆ నిబంధన భారత రాజ్యాంగంలోని గోప్యతా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని ప్రకటించాలని ఢిల్లీ హైకోర్టును వాట్సాప్ కోరింది. 


కాగా, వాట్సాప్ సంస్థే గోప్యతా నియమాలను పాటించడం లేదని, ఆ సంస్థకు చట్టాన్ని ప్రశ్నించే హక్కు లేదని పిటిషనర్ పేర్కొన్నాడు. వాట్సాప్ ద్వారా ఫేక్ మేసేజ్‌లు, వీడియోలు, ఫొటోలు విపరీతంగా సర్క్యులేట్ అవుతూ కొన్నిసార్లు తీవ్ర ఉద్రిక్తతలు రేపుతున్నాయని పేర్కొన్నాడు. దేశ వ్యతిరేక శక్తులు వీటిని బాగా వినియోగించుకుంటున్నాయని తెలిపాడు. జాతి భద్రత దృష్ట్యా ఏ కంపెనీ అయినా ప్రభుత్వానికి సహకరించాలని, లేకపోతే అలాంటి సంస్థను దేశంలో కార్యకలాపాలు సాగించకుండా నిషేధించాలని పిటిషనర్ కోరాడు. 

Updated Date - 2021-06-23T22:08:53+05:30 IST