నిమ్మకట్టుపై చిన్నచూపు
ABN , First Publish Date - 2022-08-16T06:12:01+05:30 IST
నాతవరం మండలంలోని పలు గ్రామాల్లో 2,400 ఎకరాలకు సాగునీరు అందించే నిమ్మకట్టు ఛానల్ అభివృద్ధి, నిర్వహణను పాలకులు, అధికారులు గాలికొదిలేశారు.
ఛానెల్ అభివృద్ధి, నిర్వహణను పట్టించుకోని పాలకులు
కాలువల్లో పెరిగిపోయిన తుప్పలు, పూడిక
పాడైపోయిన గేట్లు
పొలాలకు నీరు సరిగా అందక రైతుల ఇక్కట్లు
నాతవరం, ఆగస్టు 15: నాతవరం మండలంలోని పలు గ్రామాల్లో 2,400 ఎకరాలకు సాగునీరు అందించే నిమ్మకట్టు ఛానల్ అభివృద్ధి, నిర్వహణను పాలకులు, అధికారులు గాలికొదిలేశారు. దీంతో ఆయకట్టు భూములకు నీరు అందడంలేదని రైతులు వాపోతున్నారు.
నిమ్మకట్టు ఛానల్ దగ్గర ఉన్న పల్లపు కాలువ, మెట్టకాలువ, పామువారి కాలువల కింద మన్యపురట్ల, రాజుపేటఅగ్రహరం, బుచ్చింపేట, వైబీఅగ్రహరం, వీబీఅగ్రహారం, కేఆర్సీపురంతోపాటు కాకినాడ జిల్లాలోని అల్లిపూడి, కాకరాపల్లి గ్రామాల్లో సుమారు రెండున్నర వేల ఎకరాల ఆయకట్టు వుంది. ప్రతి ఏడాది ఖరీఫ్తోపాటు రబీలో ఆరు తడిపంటలకు సాగునీరు అందుతుంది. అయితే నిమ్మకట్టు ఛానల్ అభివృద్ధి, నిర్వహణ గురించి ఏళ్ల తరబడి అధికారులు, పాలకులు పట్టించుకోవడంలేదు. కాలుల్లో తుప్పలు విపరీతంగా పెరిగాయి. పూడిక పేరుకుపోయింది. దీంతో కాలువల భూములకు సాగునీరు అందకపోవడంతో పంటలు సరిగ పండక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రెండు కాలువల మెయిన్గేట్లు దెబ్బతిన్నాయి. దీంతో ఆయకట్టుకు అవసరం లేని సమయంలో కూడా నీరు వృథాగా పోతున్నది.
కాలువల్లో తుప్పలు, పూడిక తొలగించి, కాలువకు సిమెంట్ లైనింగ్ చేయిస్తామని ఐదేళ్ల క్రితం అధికారులు ప్రకటించారు. దీంతో ఆయకట్టు చివరి భూములకు కూడా పూర్తిస్థాయిలో నీరు అందుతుందని చెప్పారు. కానీ ఇంతవరకు ఎటువంటి పనులు చేపట్టలేదు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నిమ్మకట్టు ఛానల్ కాలువలను బాగు చేయించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
చివరి భూములకు నీరందడంలేదు
వి.సూర్యారావు, రైతు, మన్యపురట్ల
నిమ్మకట్టు ఛానల్ అభివృద్ధి పనుల విషయంలో పాలకులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. గేట్లు దెబ్బతినడమే కాకుండా కాలువల్లో తుప్పలు బాగా పెరిగిపోయాయి. పూడిక కూడా పేరుకుపోయింది. వీటివల్ల నీరు సరిగా ప్రవహించక చివరి ఆయకుట్టు భూముల రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మెల్యే, అధికారులు స్పందించి అభివృద్ధి పనులు చేయించాలి.