బావిలో ప్రాణమున్న ఖజానా!
ABN , First Publish Date - 2022-09-29T09:22:14+05:30 IST
ఒక ఊరిలో శ్రీకాంత్, రాజు, రాము అనే ముగ్గురు స్నేహితులుండేవాళ్లు. వీళ్లంతా చరిత్ర పిచ్చోళ్లు. చరిత్రను చదివేటోళ్లు.
ఒక ఊరిలో శ్రీకాంత్, రాజు, రాము అనే ముగ్గురు స్నేహితులుండేవాళ్లు. వీళ్లంతా చరిత్ర పిచ్చోళ్లు. చరిత్రను చదివేటోళ్లు. ఫలానా చోట నిధులు, బంగారు దొరుకుతుందంటే.. అది మనకు దొరుకుతుందేమోననే ఆశ వీళ్లది. వీరిలో శ్రీకాంత్ చురుకైనవాడు. కోపిష్టి. సహృదయుడు. రాజు, రాము కొంత స్వార్థంగానే ఆలోచిస్తారు. ఒక రోజు గుడి దగ్గర ఉండే ఓ సాధువు ఊరికి ఉత్తరాన ఓ బావి ఉంది. అది దయ్యాల బావి అంటారు కానీ.. అందులో నిధి ఉంది అని చెప్పాడట. ఆ తర్వాత అదృశ్యమయ్యాడట. ఈ విషయం ‘మా నాన్నమ్మ చెప్పింద’ంటూ రాజు ఆ రోజు ఒకింత ఉద్వేగంతో బడిలో చెప్పాడు. ఆ బావికి వెళ్లాలని ఆదివారం రోజున ముహూర్తం పెట్టుకున్నారు.
ఆదివారం ఉదయాన్నే ముగ్గురు స్నేహితులు బయలుదేరారు. ఒక నదిని దాటారు. కొంచెం దూరం వెళ్లాక .. శ్రీకాంత్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమైందని చూస్తే- జలగ రక్తం పీలుస్తోంది. ‘శ్రీకాంత్ భయపడకు. నా పాకెట్లో ఉప్పునీళ్లు ఉంది’ అంటూ వేగంగా ఉప్పునీళ్లను పోశాడు రాజు. జలగ పట్టు వదిలేసింది. ఇంకొంత దూరం వెళ్లాక.. అమాంతంగా తేనెటీగలు వారిపై దాడి చేశాయి. ‘మీరు బ్యాగుల్లో దాక్కోండి. పాలిథీన్ కవర్లు ముఖానికి పెట్టుకోండి’ అన్నాడు రాము. క్షణాల్లో పొగ అంటించి వాటిని పారిపోయేట్లు చేశాడు రాము. ముగ్గురూ ఆ బావిని గుర్తుపట్టారు. అక్కడికి వెళ్లగానే రెండు పాములు మీదకు వచ్చాయి. ముగ్గురూ కట్టెలు తీసుకున్నారు. ఆ పాములు దూరంగా వెళ్లిపోయాయి. బావిలోకి తొంగి చూస్తే నీళ్లు లేవు. ఒక గడ్డపార తీసుకుని నడుముకు తాడును కట్టుకున్నాడు శ్రీకాంత్. ఇద్దరు మిత్రులు మెల్లగా కిందకి వదిలారు. కింద ఏమీ లేదు. నీళ్లు లేని వట్టి బావి అది. తెల్లగా నిగనిగలాడుతూ కనిపించింది. అది కుందేలు. ఆ కుందేలును పట్టుకున్నాడు. అక్కడ నిధి లేదని అర్థమైంది. వెంటనే స్నేహితులను లాగమన్నాడు. ఆ కుందేలును పట్టుకుని పైకొచ్చాడు. ఆ కుందేలు పిల్లను వదిలాడు. ‘శ్రీకాంత్ నువ్వెంత మంచి వాడవు’ అన్నారు ఇద్దరూ. కుందేలు పిల్లను బావి గట్టున పొదలమాటున దాక్కున్న పేరెంట్స్ చూశాయి. ‘దేవుడే వచ్చాడ’ని కుందేళ్లు అనుకున్నాయి. ఖజానా దొరక్కపోయినా.. ఓ ప్రాణాన్ని కాపాడామనే సంతోషంతో ఇంటికి వెళ్లారు ఆ స్నేహితులు.