ఉత్సాహంగా సాగిన ఫ్రీడం ర్యాలీ
ABN , First Publish Date - 2022-08-14T06:46:18+05:30 IST
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకోని జిల్లా కేంద్రంలో శనివారం చేపట్టిన ఫ్రీడం ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది.
- పాల్గొన్న కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు
పెద్దపల్లి కల్చరల్, ఆగస్టు 13: స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకోని జిల్లా కేంద్రంలో శనివారం చేపట్టిన ఫ్రీడం ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. ఈ ర్యాలీలో కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనా రాయణ, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి 75 మీటర్ల జాతీయ పతాకంతో ప్రారంభమైన ర్యాలీ సాగర్ రోడ్డు మీదుగా ఎల్లమ్మ చెరువు వరకు కొనసాగింది. జిల్లాలోని అధికారులు, ప్రజాప్రతినిధు లు, పోలీసులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ కేడెట్లు, ఏడో బెటాలియన్, సిబ్బంది, పలు పాఠశాలల, కళాశాలల విద్యార్థులు, కళాకారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధు లు, ఆర్మీ అధికారులు త్రివర్ణ పతాకాలను చేతబూని దేశభక్తి నినాదాలు చేశారు. ఫ్రీడం ర్యాలీకి హాజరైన వారితో ఎల్లమ్మ చెరువు ప్రాంగణం కిక్కిరిసిపోయింది. కళాకారులు దేశభక్తి గేయాలు ఆలపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన గురుతర బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఇన్చార్జి డీసీపీ రూపేష్, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి పాల్గొన్నారు.