ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను వేగంగా రప్పించాలంటూ పిల్

ABN , First Publish Date - 2022-02-25T16:20:59+05:30 IST

రష్యా దాడులతో అతలాకుతలమవుతున్న ఉక్రెయిన్‌లో చిక్కుకున్న

ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను వేగంగా రప్పించాలంటూ పిల్

న్యూఢిల్లీ : రష్యా దాడులతో అతలాకుతలమవుతున్న ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను వేగంగా స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని న్యాయవాది విశాల్ తివారీ సుప్రీంకోర్టును కోరారు. భారతీయుల తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని గురువారం దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)లో కోరారు. తన పిటిషన్‌పై సత్వరమే విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. 


రష్యన్ దళాలు గురువారం ఉదయం ఉక్రెయిన్‌పై భయానకంగా దాడి ప్రారంభించాయని, దీంతో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులు, విద్యార్థులకు అవసరమైన ఆహారం, మందులు వంటి అత్యవసర వస్తువులను సరఫరా చేయాలని ఆదేశించాలని కోరారు. భారతీయులను తిరిగి స్వదేశానికి రప్పించడం భారత ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. 


మన దేశంలోని ప్రతి రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఉక్రెయిన్‌లో చదువుకుంటున్నారని, వీరంతా రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్నారని, వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వ సాయం కోసం అర్థిస్తున్నారని పిటిషనర్ తెలిపారు. దేశంలో మాత్రమే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులను సైతం కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. ముఖ్యంగా ప్రజలు రవాణా సదుపాయాలు లేని సమయంలో నిస్సహాయంగా ఉన్నపుడు ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. ప్రభుత్వం వివిధ రకాల దౌత్యపరమైన చర్యలను చేపట్టాలన్నారు. 


ఇదిలావుండగా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులు వేర్వేరుగా భారత ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. తాము సురక్షితంగా స్వదేశానికి తిరిగి రావడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అనేక మంది విద్యార్థులు తీవ్రంగా విలపిస్తూ భారత ప్రభుత్వానికి చేస్తున్న విజ్ఞప్తులతో కూడిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. 


మరోవైపు తమిళనాడు, హర్యానా, కర్ణాటక వంటి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నాయి. తమ రాష్ట్రాలకు చెందినవారు ఉక్రెయిన్‌లో చిక్కుకున్నారని, వారిని స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. భారతీయులను తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌కు లేఖలు రాశాయి. ఆంధ్ర ప్రదేశ్, కేరళ, పంజాబ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ప్రధాన మంత్రి కార్యాలయానికి, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖలు రాశారు.


Updated Date - 2022-02-25T16:20:59+05:30 IST