చెన్నై : రెండు ఆకుల గుర్తు కేసులో సాక్షి అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2022-04-07T22:11:14+05:30 IST

రెండు ఆకుల గుర్తు కోసం ముడుపుల కేసులో కీలక సాక్షి

చెన్నై : రెండు ఆకుల గుర్తు కేసులో సాక్షి అనుమానాస్పద మృతి

చెన్నై : రెండు ఆకుల గుర్తు కోసం ముడుపుల కేసులో కీలక సాక్షి బీ గోపీనాథ్ (31) అనుమానాస్పద స్థితిలో మరణించి కనిపించారు. న్యాయవాది అయిన ఆయన ఏప్రిల్ 8న ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ న్యూఢిల్లీ కార్యాలయంలో విచారణకు హాజరుకావలసి ఉంది. ఆయన బుధవారం తన నివాసంలోనే సీలింగ్‌కు వేలాడుతూ కనిపించారు. 


గోపీనాథ్ కుటుంబ సభ్యులను ఉటంకిస్తూ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గోపీనాథ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మంగళవారం ఫోన్ చేశారు. ఏప్రిల్ 8న న్యూఢిల్లీలోని తమ కార్యాలయంలో దర్యాప్తుకు హాజరుకావాలని ఈడీ అధికారులు చెప్పారు. దీంతో ఆయన తీవ్రమైన అలజడికి గురయ్యారు. రాత్రి భోజనం చేసిన తర్వాత తన గదిలోకి వెళ్ళారు. బుధవారం తెల్లవారుజామున ఆయన కుటుంబ సభ్యులు చూసేసరికి ఆయన సీలింగ్‌కు వేలాడుతూ కనిపించారు. 


ఈ సమాచారం తెలుసుకున్న తిరువేర్కడు పోలీస్ స్టేషన్ పోలీసులు ఆయన మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ కిల్‌పౌక్ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ఆయన నివాసంలో సూసైడ్ నోట్ కనిపించలేదని, ఆయన ఫోన్‌‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీస్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ చెప్పారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఫోన్ కాల్‌లో ఆయనను సాక్షిగా హాజరుకావాలని కోరినట్లు తెలిసిందని, ఆయన ఆత్మహత్యకు కారణం ఇదేనా? కాదా? అనే విషయం తెలియదని చెప్పారు. 


గోపీనాథ్ తిరువేర్కడులోని సుందర చోళపురంలో ఉంటున్నారు. ఆయన మరో అడ్వకేట్ వద్ద జూనియర్‌గా పని చేస్తున్నారు. 2017లో టీటీవీ దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే పార్టీకి రెండు ఆకుల గుర్తును కేటాయించేవిధంగా చేయడం కోసం సుకేష్ చంద్రశేఖర్‌తో చర్చలు జరిపినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. సుకేష్ అరెస్టయ్యారు. 


గోపీనాథ్ తన సీనియర్ లాయర్ల ఆదేశాల మేరకు సుకేష్‌తో సంబంధాలు నెరపుతున్నట్లు ఈడీ అధికారులు ఆరోపించారు. 2017లో సుకేష్‌పై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు తిరువేర్కడులోని గోపీనాథ్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. సుకేష్‌ను ఈడీ అధికారులు గత వారం ప్రశ్నించి, స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. సుకేష్ ప్రస్తావించినవారిని కూడా విచారించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా టీటీవీ దినకరన్‌కు బుధవారం సమన్లు జారీ చేసి, ఢిల్లీ కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశించారు. గోపీనాథ్‌ను సాక్షుల్లో ఒకరిగా చేర్చారు. 


Updated Date - 2022-04-07T22:11:14+05:30 IST