Kerala Court : భార్య ఆత్మహత్య కేసులో భర్త దోషి

ABN , First Publish Date - 2022-05-23T22:28:26+05:30 IST

ఆత్మహత్య చేసుకునేవిధంగా భార్యను ప్రేరేపించిన కేసులో

Kerala Court : భార్య ఆత్మహత్య కేసులో భర్త దోషి

తిరువనంతపురం : ఆత్మహత్య చేసుకునేవిధంగా భార్యను ప్రేరేపించిన కేసులో భర్త దోషి అని కేరళలోని ఓ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది.  వరకట్నం కోసం డిమాండ్ చేయడంతోపాటు ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు నమోదైన ఆరోపణలు రుజువైనట్లు తెలిపింది. దోషికి శిక్షను మంగళవారం ఖరారు చేసే అవకాశం ఉంది. 2021 జూన్‌లో ఈ దారుణం జరిగింది. 


మెడికల్ విద్యార్థిని విస్మయను పెళ్లి చేసుకున్న కిరణ్ ఆమెను వరకట్నం కోసం తీవ్రంగా వేధించినట్లు ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ఆమె ఆత్మహత్య చేసుకునే విధంగా ఆయన ప్రేరేపించినట్లు తెలిపింది. ఆమె 2021 జూన్‌లో తన అత్తవారింట్లో ఆత్మహత్య చేసుకున్నారు. 


కిరణ్ తన భార్యను వరకట్నం కోసం వేధించినట్లు, ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించినట్లు కొల్లం అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి-1 సుజిత్ కేఎన్ సోమవారం తీర్పు చెప్పారు. భారత శిక్షా స్మృతి (IPC), వరకట్న నిషేధ చట్టం (Dowry Prohibition Act) ప్రకారం నేరాలు రుజువైనట్లు తెలిపారు. 


పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రాసిక్యూషన్, దోషి కిరణ్ వాద, ప్రతివాదాలను కోర్టు మంగళవారం విచారించి, దోషికి శిక్షను ఖరారు చేసే అవకాశం ఉంది. ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ, ఇది ఓ వ్యక్తికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పు కాదని, ఓ సాంఘిక దురాచారానికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పు అని తెలిపారు. 


ఐపీసీ సెక్షన్ 304బీ ప్రకారం వరకట్న సంబంధిత మరణం నేరానికి పాల్పడిన దోషికి కనీసం ఏడేళ్ళ జైలు శిక్ష విధించవచ్చు. గరిష్ఠంగా జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది. ఐపీసీ సెక్షన్ 498ఏ ప్రకారం వరకట్నం కోసం వేధించినందుకు గరిష్ఠంగా మూడేళ్ళ జైలు శిక్ష, ఐపీసీ సెక్షన్ 306 ప్రకారం ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు గరిష్ఠంగా పదేళ్ళ జైలు శిక్ష విధించవచ్చు. 


విస్మయ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, 100 సవరల బంగారం, ఒక ఎకరా విస్తీర్ణంగల భూమి వరకట్నంగా కిరణ్‌కు ఇచ్చారు. వీటితోపాటు రూ.10 లక్షల విలువైన ఓ కారును కూడా ఇచ్చారు. అయితే ఆ కారును కిరణ్ ఇష్టపడలేదు. దానికి బదులుగా నగదు ఇవ్వాలని కోరాడు. అందుకు విస్మయ కుటుంబీకులు తిరస్కరించారు. దీంతో విస్మయను కిరణ్ నిరంతరం వేధించేవారు. 


కిరణ్ అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది. తాజా తీర్పుతో ఆయనను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 


విస్మయ తండ్రి మాట్లాడుతూ, తన కుమార్తెకు న్యాయం జరిగిందన్నారు. ప్రాసిక్యూషన్, ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎంతో గొప్పగా కృషి చేసిందని, వారికి కృతజ్ఞతలు చెప్తున్నానని తెలిపారు. కృతజ్ఞతలు వ్యక్తం చేయడానికి మాటలు లేవన్నారు. 


Updated Date - 2022-05-23T22:28:26+05:30 IST