Bengaluru: సంవత్సరం క్రితం పెళ్లి చేసుకుని ఇప్పుడెంత పాపం చేశాడో చూడండి..

ABN , First Publish Date - 2022-05-08T22:44:54+05:30 IST

సంవత్సరం క్రితం పెళ్లి చేసుకున్నాడు. మూడు నెలల గర్భంతో ఉన్న భార్యను హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు. ఈ షాకింగ్ ఘటన బెంగళూరులోని నేలమంగళ పరిధిలో..

Bengaluru: సంవత్సరం క్రితం పెళ్లి చేసుకుని ఇప్పుడెంత పాపం చేశాడో చూడండి..

నేలమంగళ: సంవత్సరం క్రితం పెళ్లి చేసుకున్నాడు. మూడు నెలల గర్భంతో ఉన్న భార్యను హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు. ఈ షాకింగ్ ఘటన బెంగళూరులోని నేలమంగళ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుముకూరు జిల్లాకు చెందిన వనిత(25), శశిధర్‌కు సంవత్సరం క్రితం పెళ్లైంది. శశిధర్ ఒక రిటైర్డ్ పోలీసు అధికారి కొడుకు. వనితను పెళ్లి చేసుకునే సమయానికి ఒక MNC కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అబ్బాయి ఉద్యోగం చేస్తుండటం, కుటుంబ నేపథ్యం కూడా వనిత తల్లిదండ్రులకు నచ్చడంతో ఆమెను శశిధర్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. అయితే.. పెళ్లి తర్వాత శశిధర్ వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. పెళ్లి చేసుకున్న రోజుల వ్యవధిలోనే ఉద్యోగం మానేశాడు. చెడు అలవాట్లకు బానిసగా మారాడు. దీంతో.. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ గొడవలు ముదిరే సమయానికి వనిత గర్భం దాల్చింది.



మూడు నెలల గర్భంతో ఉన్న భార్యను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఆమె భర్త శశిధర్ డబ్బు కోసం వేధించసాగాడు. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన వనిత కొన్ని రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య వెళ్లిపోయిన కొద్దిరోజులకే ఇకపై గొడవలు పడనని, ఇబ్బంది పెట్టనని ఆమెకు హామీ ఇచ్చి శశిధర్ ఆమెను తిరిగి కాపురానికి తెచ్చుకున్నాడు. భర్త మాటలను నమ్మి రావడమే ఆమె చేసిన తప్పైంది. ఇంట్లో ఉన్న భార్యను గదిలోకి తీసుకెళ్లి గొంతు కోసి శశిధర్ హత్య చేశాడు. ఆమెను చంపాక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. వనిత కుటుంబం ఈ ఘటనతో దిగ్భ్రాంతికి లోనైంది. భర్తను నమ్మి కాపురానికి వెళితే అతనూ, అతని కుటుంబం తమ కూతురిని పొట్టనపెట్టుకున్నారని ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. శశిధర్‌పై, అతని కుటుంబంపై వరకట్న వేధింపులతో పాటు హత్య కేసు నమోదైంది. ఈ హత్య కేసులో పోలీసులు శశిధర్‌పై, అతని తల్లి అన్నపూర్ణమ్మ, తండ్రి, శశిధర్ సోదరి, ఆమె భర్తపై కేసు నమోదు చేశారు.

Read more