Heart Breaking Incident: పట్టుబట్టి పెద్దలను పెళ్లికి ఒప్పించి సరిగ్గా రేపోమాపో ముహూర్తాలు అనుకుంటున్న టైంలో..

ABN , First Publish Date - 2022-05-16T21:06:56+05:30 IST

ధనుష్, సుష్మా రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ధనుష్ వయసు 23 సంవత్సరాలు. సుష్మ వయసు 22 సంవత్సరాలు. ప్రాణంగా ప్రేమించుకున్న వీరిద్దరికీ..

Heart Breaking Incident: పట్టుబట్టి పెద్దలను పెళ్లికి ఒప్పించి సరిగ్గా రేపోమాపో ముహూర్తాలు అనుకుంటున్న టైంలో..

బెంగళూరు: ధనుష్, సుష్మా రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ధనుష్ వయసు 23 సంవత్సరాలు. సుష్మ వయసు 22 సంవత్సరాలు. ప్రాణంగా ప్రేమించుకున్న వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి చచ్చేంత ఇష్టం. ఈ మాటను సుష్మ నిజం చేసింది. తన ప్రియుడు, కాబోయే భర్త అయిన ధనుష్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆమె కూడా విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన రెండు కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ధనుష్ అనే యువకుడు బెంగళూరులో క్లాత్ షోరూం నడుపుకుంటూ ఉండేవాడు. ధనుష్ సొంతూరు తుమకూరు జిల్లా ముస్కల్ గ్రామం. బెంగళూరులో క్లాత్ షోరూం నడుపుతున్న ధనుష్‌కు హసన్ జిల్లా బేలూరు తాలూకాలోని ఆరేహళ్లి గ్రామానికి చెందిన సుష్మ అనే యువతితో పరిచయం ఏర్పడింది. సుష్మ MCom చదివింది. ఈ ఇద్దరి పరిచయం కొన్నాళ్లకు ప్రేమగా మారింది. గాఢంగా ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత దగ్గరయ్యారు.



జీవితంలో స్థిరపడటంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పి వారి అంగీకారంతో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇరు కుటుంబాలకు తమ ప్రేమ విషయాన్ని చెప్పారు. రెండు కుటుంబాలు పెళ్లికి ససేమిరా అన్నాయి. అయితే.. సుష్మ, ధనుష్ పట్టుబట్టి మరీ ఇరు కుటుంబాలను ఒప్పించారు. త్వరలో పెళ్లికి ముహూర్తం పెట్టుకోవాలని ఇరు కుటుంబాలు భావించాయి. పెద్దలను కూడా ఒప్పించడంతో తమ పెళ్లికి ఇక ఎలాంటి అడ్డంకులు లేవని సుష్మ, ధనుష్ ఎంతో సంతోషించారు. కానీ.. విధి సంతోషంగా ఉన్న ఈ ప్రేమ జంటను చూసి ఓర్వలేకపోయింది. మే 11న బెంగళూరు నుంచి సొంతూరులో జరిగే జాతరకు ధనుష్ బైక్‌పై బయల్దేరాడు. కులనహళ్లి వద్ద యాక్సిడెంట్ జరగడంతో ధనుష్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలిసి కాబోయే భర్తపై పంచ ప్రాణాలు పెట్టుకున్న సుష్మ కుప్పకూలిపోయింది.



ధనుష్‌తో కలిసి ఎన్నో మధుర క్షణాలను గడపాలని ఊహించుకున్న సుష్మకు భవిష్యత్ అంధకారంగా కనిపించింది. ధనుష్‌ను చివరి చూపులు చూసి గుండెలవిసేలా రోదించింది. అంత్యక్రియలు పూర్తయ్యాయి. కానీ.. ధనుష్ ఆత్మఘోష సుష్మకు ఇంకా వినిపిస్తూనే ఉంది. ఏడ్చి ఏడ్చి ఆమె కళ్లలో కన్నీరు ఇంకిపోయింది. ధనుష్ లేని లోకంలో తానూ ఉండకూడదని సుష్మ తీవ్ర మనస్తాపంతో నిర్ణయం తీసుకుంది. మే 14న సుష్మ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రియుడే సర్వస్వం అని భావించి అతనితో కలిసి ఏడడుగులు నడవాలని ఎంతో ఆశ పడ్డ సుష్మ జీవితం, ఆమె ప్రియుడి జీవితం ఇలా అర్థాంతరంగా ముగిసిపోవడంతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Updated Date - 2022-05-16T21:06:56+05:30 IST