మూర్ఛతో పొలంలోనే ప్రాణాలొదిలిన రైతు

ABN , First Publish Date - 2022-08-11T05:59:23+05:30 IST

మూర్ఛతో ఓ రైతు పొలంలోనే ప్రాణాలు వదిలాడు. నూతనకల్‌ మండలం వెంకేపల్లి గ్రామంలో మంగళవారం ఈ ఘటన జరిగింది.

మూర్ఛతో పొలంలోనే ప్రాణాలొదిలిన రైతు
యాదగిరి (ఫైల్‌ ఫొటో)

నూతన్‌కల్‌, ఆగస్టు 10: మూర్ఛతో ఓ రైతు పొలంలోనే ప్రాణాలు వదిలాడు. నూతనకల్‌ మండలం వెంకేపల్లి గ్రామంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. స్థానికుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. వెంకేపల్లి గ్రామానికి చెందిన పచ్చిపాల యాదగిరి(35) తనకున్న  రెండు ఎకరాల్లో వరి సాగు చేస్తూనే మేకలు పెంచుతున్నాడు. ఈ నెల 5వ తేదీన యాదగిరి, ఆయన బాబాయ్‌ బుచ్చయ్య తమకు ఉన్న చెరో 50 మేకలను మేపడానికి గ్రామ శివారులో ఉన్న ఏరు దాటి అవతలికి వెళ్లారు. పాలేరు వాగులో నాలుగు అడుగుల ఎత్తున నీరు ప్రవహిస్తున్నందున గొర్రెలను ఇంటికి తోలుకువెళితే కొట్టుకుపోతాయనే భయంతో ఇంటికి వచ్చి బియ్యం, వంట సామగ్రి తీసుకువెళ్లి అక్కడే ఉన్న మైదానంలో గొర్రెలను మేపుతున్నారు. ఈ నెల తొమ్మిదో తేదీన పొలానికి వెళ్లొస్తానని బాబాయ్‌ బుచ్చయ్యతో చెప్పి వెళ్లిన యాదయ్య తిరిగిరాలేదు. సాయంత్రమైనా యాదగిరి తిరిగి రాకపోవడంతో ఇంటికి ఫోన్‌ చేయగా, వెళ్లలేదని తెలిసింది. బుచ్చయ్య సమాచారంతో  కుటుంబ సభ్యులు చుట్టపక్కల వెదికినా యాదగిరి ఆచూకీ తెలియరాలేదు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు గ్రామస్థుల సాయంతో పొలంతో వెదకగా మృతి చెంది ఉన్నాడు. యాదగిరికి మూర్ఛ వ్యాధి ఉందని,  పొలంలోనే మూర్ఛ రావడంతో మొఖం వరి పొలంలోనే బురదలో కూరుకుని ఊపిరాడక మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు.  యాదగిరికి భార్య, 10, 8 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. యాదగిరి మృతదేహాన్ని గ్రామస్థులు కావడి సాయంతో వాగు దాటి ఇంటికి తీసుకువచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు కాలేదు.




Updated Date - 2022-08-11T05:59:23+05:30 IST