రూ.1.50 కోట్ల అప్పు చేసి పరారైన కుటుంబం

ABN , First Publish Date - 2022-01-28T04:33:34+05:30 IST

ముండ్లమూరు మండలంలోని మారెళ్లలో ఓ కుటుంబం రూ.1.50 కోట్లకు అప్పు చేసి చెప్పాపెట్టకుండా గ్రామం నుంచి ఉడాయించింది.

రూ.1.50 కోట్ల అప్పు చేసి పరారైన కుటుంబం
మారెళ్లలో బాధితుల వివరాలు సేకరిస్తున్న పోలీసులు

మారెళ్లలో ఘటన.. బాధితుల ఫిర్యాదు.. వివరాలు సేకరించిన పోలీసులు 

ముండ్లమూరు, జనవరి 27 : మండలంలోని మారెళ్లలో ఓ కుటుంబం రూ.1.50 కోట్లకు అప్పు చేసి చెప్పాపెట్టకుండా గ్రామం నుంచి ఉడాయించింది.  దీంతో అప్పులు ఇచ్చిన వారు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకెళ్తే... మారెళ్ల గ్రామానికి చెందిన శిఖాకొల్లు సురేంద్ర, తల్లి రాధమ్మ, తండ్రి శ్రీనివాసరావులు గ్రామంలో ఒకరికి తెలియకుండా ఒకరి వద్ద ఇలా సుమారు 50 మంది వద్ద పెద్ద మొత్తంలో అప్పు తీసుకొన్నారు. ఇందుకు సంబంధించి నోట్లు కూడా రాశారు. గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రే సామాన్లు సైతం సర్దుకొని పరారైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రూ.1.50 కోట్ల మేర మోసపోయామని కొందరు బాధితులు తమకు న్యాయం చేయాలంటూ గత నెల 9న ఎస్పీ మల్లిక గర్గ్‌ నిర్వహించిన స్పందనలో శిఖాకొల్లి సురేంద్ర కుటుంబంపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును ముండ్లమూరు పోలీసులకు పంపించగా వారు గురువారం మారెళ్లలో విచారణ చేశారు. మోసపోయిన బాధితుల వద్ద ప్రామిసరీ నోట్లు పరిశీలించి వారి చేత ఫిర్యాదు తీసుకున్నారు.

సురేంద్ర కొంత మంది వద్ద, ఆయన తండ్రి శ్రీనివాసరావు మరికొంత మంది వద్ద, తల్లి రాధమ్మ ఇంకొందరి వద్ద రూ.25 వేలు నుంచి రూ.5 లక్షల వరకు అప్పులు తీసుకున్నారు. స్వగ్రామమైన మారెళ్లలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న జమ్మలమడక, అద్దంకి, నాగులపాడు, కురిచేడు ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో కూడా అప్పులు చేసినట్లు సమాచారం. మారెళ్ల గ్రామానికి చెందిన ఎస్‌కే ఆంజనేయులు వద్ద రూ.4 లక్షలు, కొడిమెల ప్రసాదు వద్ద రెండు లక్షలు, కోనంకి శ్రీను వద్ద రూ.లక్ష, నల్లబోతుల వీరాంజనేయులు వద్ద రూ.2.60 లక్షలు, కొణిదన రామదాసు వద్ద రూ.లక్ష, కొణిదన రాధాకృష్ణ వద్ద రూ.లక్ష, కోటయ్య వద్ద రూ.50వేలు, ఇలా రూ. 1.50 కోట్ల వరకు నగదు తీసుకున్నారు. వీరికి అనుమానం రాకుండా కొన్నాళ్ల పాటు నమ్మకంగా వ్యవహరించారు. తీరా గతనెల 7వ తేదీ రాత్రి గుట్టుచప్పుడుగాకుండా ఇంటికి తాళాలు వేసి పరారయ్యారు. అదే రోజు ఉదయం ఇంటికి తాళం వేసి ఉండటాన్ని చూసిన బాధితులు లబోదిబోమన్నారు. చేసేదేమి లేక లోలోన కుమిలిపోయారు. ఆ తరువాత జిల్లా ఎస్పీని కలసి తమ గోడు వినిపించి న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ క్రమంలో బాధితుల వివరాలు సేకరించేందుకు ముండ్లమూరు పోలీసులు వెళ్లగా కొందరు కన్నీటి పర్యంతమయ్యారు. మోసగించిన సురేంద్ర కుటుంబం నేటికి ఎక్కడ ఉందో కూడా సమాచారం తెలియ లేదు. 

Updated Date - 2022-01-28T04:33:34+05:30 IST