దళిత విద్యార్థినిని కొట్టి చంపడం దారుణం

ABN , First Publish Date - 2022-08-17T05:19:03+05:30 IST

స్వతంత్ర భారత వజ్రోత్సవాల మీద నెత్తుటి మరకగా చిన్నారి ఇంద్ర మేగ్వాల్‌ హత్య మిగిలిపోతోందని ఎమ్మార్పీఎస్‌ జిల్లా కో కన్వీనర్‌ ముండ్రాతి కృష్ణ, జిల్లా నాయకులు లింగంపల్లి శ్రీనివాస్‌ అన్నారు.

దళిత విద్యార్థినిని కొట్టి చంపడం దారుణం
నిరసన వ్యక్తం చేస్తున్న ఎమ్మార్పీఎస్‌ నాయకులు

సిద్దిపేట అర్బన్‌, ఆగస్టు 16: స్వతంత్ర భారత వజ్రోత్సవాల మీద నెత్తుటి మరకగా చిన్నారి ఇంద్ర మేగ్వాల్‌ హత్య మిగిలిపోతోందని ఎమ్మార్పీఎస్‌ జిల్లా కో కన్వీనర్‌ ముండ్రాతి కృష్ణ, జిల్లా నాయకులు లింగంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. రాజస్థాన్‌లో మంచినీళ్ల కుండలోని నీళ్లను తాగిందనే నెపంతో దళిత చిన్నారి ఇంద్రమేగ్వాల్‌ను అగ్రవర్ణ ఉపాధ్యాయుడు దారుణంగా కొట్టి చంపడాన్ని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో మంగళవారం సిద్దిపేటలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్‌ నాయకులు మాట్లాడుతూ దళితులకు కనీసం అందరూ తాగే కుండలోని నీళ్లు తాగే స్వేచ్ఛలేని 75 ఏళ్ల స్వాతంత్య్రం ఎవరికోసం వచ్చినట్లు అని ప్రశ్నించారు. ఇంద్ర మేగ్వాల్‌ కుటుంబానికి రాజస్థాన్‌ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రధానమంత్రి స్వాతంత్య్ర వజ్రోత్సవ ప్రసంగంలో దళిత చిన్నారి మృతిని ప్రస్తావించకపోవడం దారుణమని అన్నారు. అన్ని దళిత, గిరిజన, బలహీనవర్గాల సంఘాలను కలుపుకుని మందకృష్ణ మాదిగ నేతృత్వంలో జాతీయస్థాయిలో ఉద్యమాన్ని నిర్మిస్తామన్నారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు రాజు, రమేష్‌, కొలిమి మల్లేష్‌, మల్కాగళ్ల రమేష్‌, ఉబ్బని ఆంజనేయులు, ప్రకాష్‌, బాబు, రాజు, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-17T05:19:03+05:30 IST