శాండ్‌విచ్‌లో మయో ఎక్కువైందని ఇద్దరు సబ్‌వే వర్కర్లపై కాల్పులు జరిపిన కస్టమర్

ABN , First Publish Date - 2022-06-30T23:10:51+05:30 IST

అమెరికాలోని డౌన్‌టౌన్ అట్లాంటా గ్యాస్ స్టేషన్ వద్ద దారుణం జరిగింది

శాండ్‌విచ్‌లో మయో ఎక్కువైందని ఇద్దరు సబ్‌వే వర్కర్లపై కాల్పులు జరిపిన కస్టమర్

న్యూయార్క్ : అమెరికాలోని డౌన్‌టౌన్ అట్లాంటా గ్యాస్ స్టేషన్ వద్ద దారుణం జరిగింది. శాండ్‌విచ్‌లో మయో ఎక్కువైనందుకు ఓ కస్టమర్ ఇద్దరు సబ్‌వే వర్కర్లపై కాల్పులు జరిపాడు. వీరిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  శాండ్‌విచ్, హంబర్గర్లపై పెట్టే దట్టమైన, చల్లని, క్రీమీ సాస్ లేదా డ్రెస్సింగ్‌ను మయోనైజ్ (మయో) అంటారు. 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సబ్‌వే (Subway) రెస్టారెంట్‌కు ఆదివారం ఓ వ్యక్తి వెళ్ళి, శాండ్‌విచ్ ఆర్డర్ చేశాడు. దానిలో మయో ఎక్కువగా ఉందని ఆ రెస్టారెంట్‌లోని ఇద్దరు వర్కర్లతో గొడవపడ్డాడు. అకస్మాత్తుగా వారిపైకి కాల్పులు జరిపాడు. దీంతో ఓ మహిళా వర్కర్ (26) అక్కడికక్కడే కుప్పకూలి, ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన జరిగినపుడు ఆమె ఐదేళ్ళ కుమారుడు అక్కడే ఉన్నాడు. 24 ఏళ్ళ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించారు.


సబ్‌వే యజమాని విల్లీ గ్లెన్ మాట్లాడుతూ, చిన్న విషయం కోసం పెద్ద గొడవ జరిగిందని చెప్పారు. కస్టమర్ మయో విషయంలో పిచ్చిపట్టినట్లు వ్యవహరించాడని చెప్పారు. శాండ్‌విచ్ మీద మయో ఎక్కువగా ఉందని కాల్పులు జరిపాడని తెలిపారు. గొడవను పెంచేందుకు కస్టమర్ నిర్ణయించుకున్నాడని, దారుణం జరిగిందని చెప్పారు. 


అర్థరహితమైన దారుణం జరిగిందని అట్లాంటా పోలీస్ డిప్యూటీ చీఫ్ చార్లెస్ హేంప్టన్ జూనియర్ చెప్పారు. శాండ్‌విచ్ రుచికరంగా లేకపోవడంతో కస్టమర్ ఇద్దరు వర్కర్లపై ఆగ్రహం వెళ్ళగక్కారని చెప్పారు. నిందితునిపైకి స్టోర్ మేనేజర్ కాల్పులు జరిపారని, అయితే తుపాకీ గురి తప్పిందని చెప్పారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. 


Updated Date - 2022-06-30T23:10:51+05:30 IST