కరుణ లేని కరోనా
ABN , First Publish Date - 2020-06-05T10:03:17+05:30 IST
కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తోంది. మేడ్చల్, రంగారెడ్డిజిల్లాలో కొవిడ్-19
ఉమ్మడి జిల్లాలో విజృంభిస్తున్న వైరస్
మేడ్చల్లో 21, రంగారెడ్డిలో 6 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రజ్యోతి, మేడ్చల్జిల్లా ప్రతినిధి / మొయినాబాద్ / మహేశ్వరం/ శామీర్పేట రూరల్ / కీసర రూరల్ : కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తోంది. మేడ్చల్, రంగారెడ్డిజిల్లాలో కొవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ సడలింపు ఇచ్చినప్పటి నుంచి కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. జీహెచ్ఎంసీకే పరిమితమైన వైరస్.. తాజాగా శివారు మునిసిపాలిటీల్లో, పల్లెలకూ పాకింది. తాజాగా గురువారం మేడ్చల్జిల్లాలో 21పాజిటివ్లు నమోదయ్యాయి. కీసర, మూడుచింతలపల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, బాలానగర్ మండలాల్లో కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. రంగారెడ్డిజిల్లాలో ఆరు పాజిటివ్ కేసులు వచ్చాయి. వీటిలో మహేశ్వరం మండలంలో నాలుగు, మొయినాబాద్ మండలంలో రెండు కేసులు ఉన్నాయి. మేడ్చల్జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 199 కేసులు నమోదయ్యాయి. వీరిలో 11మంది మృతి చెందారు. కోలుకుని 99మంది డిశ్చార్జి కాగా, 89 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
రిపోర్టర్కి పాజిటివ్..
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని ఓ పత్రిక రిపోర్టర్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఐదురోజుల క్రితం ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్లోని ఓ హాస్పటల్కు వెళ్లాడు. అక్కడ అతనికి కరోనా టెస్టులు చేశారు. గురువారం పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో మొయినాబాద్ను కంటైన్మెంట్ జోన్గా ప్రకటించి దుకాణాలను మూసివేయించారు.
మహేశ్వరం మండలంలో ఐదుగురికి..
మహేశ్వరం మండలంలో కరోనా విజృంభిస్తోంది. మూడు రోజుల క్రితమే మహేశ్వరంలో నలుగురికి, హర్షగూడలో ఒకరికి పాజిటివ్ కేసు నమోదు కావడంతో వారిని గాంధీకి తరలించారు. దీంతో కొందరిలో కరోనా అనుమానిత లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా హర్షగూడలో నలుగురికి, తుక్కుగూడలో ఒకరికి పాజిటివ్ వచ్చింది.
మూడుచింతలపల్లిలో ఒకరికి..
మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండల కేంద్రంలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. క్యాన్సర్తో బాధపడుతున్న వ్యక్తి(72) నగరంలోని కిమ్స్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం ఈనెల 3న వెళ్లాడు. ఆస్పత్రి వైద్యులు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో అతని కుటుంబీకులను హోమ్క్వారంటైన్ చేయాలని వైద్యులు సూచించారు.
కీసర మండలంలో రెండు..
కీసర మండల పరిధిలో గురువారం రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నాగారం మున్సిపాలిటీ ఎస్వీనగర్లోని వృద్ధుడికి (64), దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని ఆర్సీఎన్క్లేవ్ కాలనీలోని మహిళకు(52) వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎస్వీనగర్ కాలనీలోని కరోనా సోకిన వృద్ధుడి కుమారుడు, కోడలు ఆస్పత్రుల్లో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దమ్మాయిగూడలోని కరోనా బాధితురాలి భర్త 3నెలల క్రితం మృతి చెందాడు.
లాక్డౌన్ ఎత్తివేయటంతో హైదరాబాద్ పాతబస్తీలోని ఆమె పుట్టింట్లో నిద్ర చేసేందుకు వెళ్లి వచ్చినట్లు స్థానికులు వెల్లడించారు. వీరిరువురు వారంరోజులుగా జ్వరంతో బాధ పడుతున్నారు. పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా తేలటంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆ రెండు కుటుంబాలకు చెందిన మిగతా వారిని హోం క్వారంటైన్లో ఉంచి పర్యవేక్షిస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.