గోవాడలో అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలి
ABN , First Publish Date - 2021-09-29T06:17:55+05:30 IST
గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో అవతవకలపై సమగ్ర విచారణ నిర్వహించాలని ప్రభుత్వ విప్, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు సూచించారు.
సమర్థుడైన ఎండీని నియమించాలి
ఫ్యాక్టరీని కోపాడుకోవాల్సిన బాధ్యత ఉంది
ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు
చోడవరం, సెప్టెంబరు 28: గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో అవతవకలపై సమగ్ర విచారణ నిర్వహించాలని ప్రభుత్వ విప్, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు సూచించారు. గోవాడ వ్యవహారాలపై విచారణ నిర్వహించాలని సీఎం జగన్కు నెల రోజుల క్రితం ముత్యాలనాయుడు ఫిర్యాదు చేయగా, సీఎం ఆదేశాల మేరకు డైరెక్టరేట్ కమిషనర్ ఆఫ్ షుగర్స్ ఐదుగురు అధికారులతో కమిటీని నియమించారు. ఈ కమిటీ గోవాడ చేరుకోగా, మంగళవారం ఉదయం ముత్యాలనాయుడు కలిసి విచారణ పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో ఎండీ పర్యవేక్షణ కరువైందని, గత క్రషింగ్ సీజన్లో ఎన్నడూలేని విధంగా అత్యంత తక్కువగా క్రషింగ్ జరిగిందని, దీనివల్ల ఫ్యాక్టరీ ఆర్థికంగా నష్టపోయిందని తెలిపారు. షార్ట్ సర్య్కూట్తో గోదాము కాలిపోవడం, ఇంజిన్ ఆయిల్ లేక క్రషింగ్ నిలిచిపోవడం వంటి చర్యలతో పాటు కాటాల వద్ద ఫీల్డు స్థాయిలో పర్యవేక్షణ కరువైందని చెప్పారు. దీనికి ఎండీదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేశారు. రెండేళ్లలో చోటుచేసుకున్న వ్యవహారాలపై విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.