ధరలు పెంచి ప్రజల నడ్డివిరుస్తున్న కేంద్రం
ABN , First Publish Date - 2022-05-21T05:05:05+05:30 IST
కేంద్రప్రభుత్వం ధరలను పెంచుతూ, ప్రజల నడ్డివిరుస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు భాస్కర్ మండిపడ్డారు.
సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు భాస్కర్
దుబ్బాకలో కేంద్రపభుత్వ దిష్టిబొమ్మ దహనం
దుబ్బాక, మే 20: కేంద్రప్రభుత్వం ధరలను పెంచుతూ, ప్రజల నడ్డివిరుస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు భాస్కర్ మండిపడ్డారు. గ్యాస్సిలెండర్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ శుక్రవారం దుబ్బాక బస్టాండ్ వద్ద కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్రప్రభుత్వం వంటగ్యాస్ ధరలను పెంచి, సామాన్య ప్రజలకు అందకుండా చేస్తుందన్నారు. ఇప్పటికే నిత్యావసర ధరలు పెంచడంతోపాటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి ఇబ్బందులకు గురిచేస్తుందని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్పొరేట్ సంస్థలకు ప్రధాని మోదీ కొమ్ముకాస్తూ సామాన్య ప్రజలపై భారం వేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేదంటే సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు సాదీక్, భాస్కర్, యాకూబ్, అరవింద్, స్వామి, నర్సింహులు, సంతోష్, రాములు పాల్గొన్నారు.