విద్యార్థినిపై అత్యాచారం కేసులో యువకుడికి 20 ఏళ్ళ జైలు
ABN , First Publish Date - 2021-01-21T12:56:05+05:30 IST
కడలూరు జిల్లాలో 14 యేళ్ళ తొమ్మిదో తరగతి చదివే విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ముద్దాయిగా తేలిన ఓ యువకుడుకి 20 యేళ్ళ జైలుశిక్ష విధిస్తూ కడలూరు....
చెన్నై, అడయార్,(ఆంధ్రజ్యోతి): కడలూరు జిల్లాలో 14 యేళ్ళ తొమ్మిదో తరగతి చదివే విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ముద్దాయిగా తేలిన ఓ యువకుడుకి 20 యేళ్ళ జైలుశిక్ష విధిస్తూ కడలూరు జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. బుధవారం వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే, ఆ విద్యార్థిని 2019లో తన తల్లిదండ్రులతో కలిసి విరుదాచలంలో ఉన్న తమ బంధువుల ఇంటికి వెళ్ళింది. అక్కడ కొంతమంది స్నేహితులతో కలిసి తోటకు వెళ్ళింది. అపుడు ఆ బాలికపై మూతామూరైకు చెందిన సెల్వకుమార్ (30) అనే యువకుడు అత్యాచారం చేశాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు.. కేసు విచారణ చేపట్టి సెల్వకుమార్ను అరెస్టు చేశారు. ఆ తర్వాత ఈ కేసు జిల్లాలోని పోక్సో ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో నిందితుడు నేరం చేసినట్టు తేలడంతో 20 యేళ్ళ జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అలాగే, 4 వేల రూపాయల అపరాధం కూడా విధించారు.