AP: 958 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ABN , First Publish Date - 2021-12-03T16:17:55+05:30 IST
ఈ నెల 20లోపు పోస్టులను..
అమరావతి(ఆంధ్రజ్యోతి): కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో(కేజీబీవీ) ప్రిన్సిపాళ్లు, పీజీటీలు, సీఆర్టీలు, పీఈటీలు, ఒకేషనల్ ఉపాధ్యాయుల పోస్టులను తక్షణం భర్తీ చేయాలని సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాల్లో జేసీలు, డీఈవోలు, సమగ్రశిక్ష ఏపీడీలు ఈ నెల 20లోపు పోస్టులను భర్తీచేసి నివేదిక పంపాలని ఆదేశించారు. కాంట్రాక్టు పద్ధతిలో దాదాపు 958 పోస్టులను భర్తీ చేయనున్నారు. కమ్యూనిటీ ఎయిడ్ అండ్ స్పాన్సర్షిప్ ప్రోగ్రాం(సీఎఎస్ఫీ) కింద వచ్చే నిధుల నుంచి ఈ సిబ్బందికి జీతాలు చెల్లిస్తారు. ఏడాది పాటు కాంట్రాక్టు ఉద్యోగులుగా ఎంపికచేసే వీరికి ప్రత్యేకంగా నియామకపత్రం ఇవ్వరు. ఏ కేజీబీవీ పాఠశాలకు రిపోర్టు చేయాలో మాత్రమే చెబుతారు.
ఎంపికైన కాంట్రాక్టు ఉద్యోగులు భవిష్యత్తులో తమ పోస్టులు క్రమబద్ధీకరించాలని కోరేందుకు వీల్లేదని, ఏడాది మధ్యలో ఎప్పుడైనా వారిని విధుల నుంచి తొలగించవచ్చని వెట్రిసెల్వి గురువారం విడుదల చేసిన మెమోలో పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉపాధ్యాయుల భర్తీకి ప్రతి జిల్లాలోనూ జాయింట్ కలెక్టర్ చైర్మన్గా ఓ కమిటీని నియమించారు.