పార్టీల విరాళాల్లో 92% కార్పొరేట్లవే!
ABN , First Publish Date - 2020-10-17T07:26:59+05:30 IST
భారత రాజకీయాలపై కార్పొరేట్లు ఎంతగా పట్టు బిగించారో రాజకీయ పార్టీలకు ఆయా సంస్థలు ఇచ్చిన
80% సొమ్ము బీజేపీకే..
అన్ని పార్టీలకూ కలిపి మిగతా 20%..
ఏడీఆర్ తాజా నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ, అక్టోబరు 16: భారత రాజకీయాలపై కార్పొరేట్లు ఎంతగా పట్టు బిగించారో రాజకీయ పార్టీలకు ఆయా సంస్థలు ఇచ్చిన విరాళాలు తెలియజేస్తున్నాయి. ఎన్నికలు జరిగిన 2018-19 ఆర్థిక సంవత్సరంలో రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్లో రూ.20 వేలకు మించిన విరాళాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) సంస్థ విశ్లేషించగా, అందులో 92% కార్పొరేట్ సంస్థల నుంచే వచ్చాయని తేలింది. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లు విరాళాల విషయంలో ప్రధానంగా కార్పొరేట్ కంపెనీల మీదే ఆధారపడుతున్నాయి.
బీజేపీకి 94%, కాంగ్రెస్కు 82% విరాళాలు(రూ.20,000+) కార్పొరేట్ కంపెనీల నుంచే దక్కాయని తేలింది. కార్పొరేట్ సంస్థల నుంచే ఎక్కువ విరాళాలు అందుకున్న పార్టీల్లో తృణమూల్ కాంగ్రెస్(97%), ఎన్సీపీ(94%) ఉన్నాయి. సీపీఎంకు అందిన విరాళాల్లో కార్పొరేట్ సంస్థల వాటా 39 శాతమే. అయితే, మొత్తం కార్పొరేట్ విరాళాల సొమ్ములో 80% బీజేపీకే దక్కాయి. మిగతా ఇరవై శాతం సొమ్మును అన్ని పార్టీలూ పంచుకున్నాయి.
లోక్సభ ఎన్నికల సమయంలో కార్పొరేట్ సంస్థలు రూ.876.10 కోట్లను వివిధ పార్టీలకు విరాళాలుగా అందించగా, అందులో రూ.698 కోట్లు బీజేపీయే సొంతం చేసుకుంది. కాంగ్రెస్ రూ.122.5 కోట్లు, ఎన్సీపీ రూ.11.34 కోట్లు అందుకున్నాయి.
2018-19లో రూ.20 వేలకు మించిన విరాళాలు (రూ.కోట్లలో)
పార్టీ | విరాళాలు | కార్పొరేట్ల వాటా | శాతం |
బీజేపీ | 742.15 | 698.082 | 94% |
కాంగ్రెస్ | 148.58 | 122.5 | 82% |
తృణమూల్ | 44.26 | 42.986 | 97% |
ఎన్సీపీ | 12.05 | 11.345 | 94% |
సీపీఎం | 3.025 | 1.186 | 39% |
సీపీఐ | 1.595 | - | 0 |
మొత్తం | 951.66 | 876.10 | 92% |