9 గంటల నిరంతర విద్యుత్
ABN , First Publish Date - 2020-09-28T11:38:33+05:30 IST
పగటిపూట 9 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్ను రైతులకు సరఫరా చేస్తున్నట్లు వ్యవసాయ, సహకార శాఖ మంత్రి
వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు
సర్పవరం జంక్షన్, సెప్టెంబరు 27: పగటిపూట 9 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్ను రైతులకు సరఫరా చేస్తున్నట్లు వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. వైద్య నగర్లో మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఆదివారం వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకం పోస్టర్లను ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డితో కలసి ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు వాడుకున్న విద్యుత్కు నయా పైసా బిల్లు చెల్లించనవరం లేదన్నారు. వ్యవసాయ బోర్లకు పగటిపూటే నాణ్యమైన 3 ఫేజ్ విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 49,500 సర్వీసులుండగా ఇందులో 45,500 సర్వీసులకు ఉచిత విద్యుత్ పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తున్నామన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయమని చెప్పారు. ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ టీవీ సూర్యప్రకాశ్, ఈఈ ఎన్.ఉదయ్భాస్కర్, వైసీపీ నేతలు నురుకుర్తి రామకృష్ణ, పుల్ల కోటేశ్వరరావు పాల్గొన్నారు.