Paradiseలో పార్టీ చేసుకుంటూ ఉండగా అటుగా వచ్చిన యువకుడు.. దగ్గరికి పిలిచి.. ఘోరం..!
ABN , First Publish Date - 2021-12-22T12:14:24+05:30 IST
Paradiseలో పార్టీ చేసుకుంటూ ఉండగా అటుగా వచ్చిన యువకుడు.. దగ్గరికి పిలిచి.. ఘోరం..!
- మద్యం మత్తులో చిత్రహింసలు..
- యువకుడి మృతి
- ఈ నెల 15న ఘటన
- 9 మంది అరెస్ట్
హైదరాబాద్ సిటీ/హైదర్నగర్ : మద్యం మత్తులో ఓ వ్యక్తిని చిత్రహింసలకు గురిచేసి అతడి మృతికి కారణమైన తొమ్మిది మందిని కేపీహెచ్బీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మంగళవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ కిషన్కుమార్ వివరాలు వెల్లడించారు. కేపీహెచ్బీ పరిధిలోని సాయినగర్ మొఘల్స్ ప్యారడైజ్ రెస్టారెంట్లో మేనేజర్గా పనిచేసే మేడ అరవింద్చౌదరి ఈ నెల 15న తనపుట్టిన రోజు కావడంతో రెస్టారెంట్ సిబ్బంది గుజ్జుల రాకేష్, హేమంత బెహరా, పొన్నపాటి మంజునాథ్రెడ్డి, రంజిత్ఖారియా, శివరామరాజు, అమూల్యకుమార్, గాదె వంశీ, జనగామ రాజశేఖర్తో కలిసి సెల్లార్లో పార్టీ చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ఇజ్జత్నగర్లో నివసించే అమర్ బారిక్ అలియాస్ రాజేష్ బాచుపల్లిలో సెంట్రింగ్ పనిచేసి ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ రెస్టారెంట్ వద్దకు వచ్చాడు.
అరవింద్చౌదరి అతడి స్నేహితులు రాజేష్ను సెల్లార్లోకి పిలిచారు. మద్యం మత్తులో ఉన్న వారు అతడిని ఐరన్ రాడ్లు, కర్రలు, వాటర్పైపులతో మూడు గంటల పాటు కొడుతూ చిత్రహింసలకు గురిచేశారు. స్పృహ తప్పి పడిపోయిన రాజేష్ను అక్కడే వదిలేసి వెళ్లారు. ఉదయం రెస్టారెంట్కు వచ్చిన సిబ్బంది రాజేష్ జేబులో దొరికిన ఫోన్ నెంబర్ ఆధారంగా అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కుటుంబసభ్యులు రాజేష్ను ఇంటికి తీసుకువెళ్లి చూడగా అతడిలో చలనం లేదు. అతడు మృతిచెందినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దాడికి పాల్పడ్డ తొమ్మిది మందిని మంగళవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.