Covid Vaccine: 84 ఏళ్ల వృద్ధురాలు.. అరగంటకే రెండో డోసు!
ABN , First Publish Date - 2021-09-19T01:19:47+05:30 IST
కరోనా టీకా వేయించుకున్న వారు ఒక డోసుకు మరో డోసుకు మధ్య నిర్ణీత వ్యవధి ఉండేలా చూసుకోవాలని ప్రభుత్వ
తిరువనంతపురం: కరోనా టీకా వేయించుకున్న వారు ఒక డోసుకు మరో డోసుకు మధ్య నిర్ణీత వ్యవధి ఉండేలా చూసుకోవాలని ప్రభుత్వ మార్గదర్శకాలు చెబుతున్నాయి. అయితే, రెండు డోసులు వెంటవెంటనే ఇచ్చిన ఘటనలు కూడా ఇటీవల వెలుగుచూశాయి. తాజాగా, కేరళలోనూ అలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. 84 ఏళ్ల వృద్ధురాలికి అరగంటలోనే రెండు డోసులూ వేశారు అక్కడి వైద్య సిబ్బంది. ఎర్నాకుళం జిల్లాలోని అలువా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిందీ ఘటన.
తన కుమారుడితో కలిసి వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఆసుపత్రికి వచ్చిన తండమ్మ పప్పు తొలి డోసు వేయించుకుని గది నుంచి బయటకు వచ్చారు. అయితే, లోపల చెప్పులు మర్చిపోవడంతో వాటిని తెచ్చుకునేందుకు మళ్లీ వెళ్లిన ఆమెను ఓ మహిళా అధికారి పిలిచి చెప్పులు విడిచి లోపలికి రావాలని కోరారు. తాను అప్పటికే తొలి డోసు వేయించుకున్నానని చెబుతున్నా ఆమె వినిపించుకోలేదని, కుర్చీలో కూర్చోమని చెప్పి వెంటనే మరో డోసు టీకా ఇచ్చేశారని వాపోయారు.
ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్న సిబ్బంది ఆమెను ఓ గంటపాటు అక్కడే ఉండాలని కోరారు. దీంతో అమె అలాగే చేసింది. ఆమెలో ఎలాంటి మార్పులు కనిపించకపోవడంతో తండమ్మను ఇంటికి పంపారు. కాగా, కొన్ని నెలల క్రితం అలప్పుజ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.