ఎయిర్పోర్టులో 810గ్రాముల బంగారం పట్టివేత
ABN , First Publish Date - 2022-08-15T05:41:41+05:30 IST
ఎయిర్పోర్టులో 810గ్రాముల బంగారం పట్టివేత
- అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు ప్రయాణికుల వద్ద స్వాధీనం
శంషాబాద్, ఆగస్టు 14: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం అక్రమంగా తరలిస్తున్న 810గ్రాముల బంగారాన్ని వేర్వేరు ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒకే రోజు ముగ్గురు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు. ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 154గ్రాముల బంగారం కడ్డీని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.8లక్షలు ఉంటుందన్నారు. దుబయ్ నుంచి 6ఈ025 ఫ్లైట్లో వచ్చిన ప్రయాణికుడు ట్రాలీ వీల్స్లో బంగారాన్ని దాచి తేగా కస్టమ్స్ అధికారులు గుర్తించారు. మధ్యాహ్నం మరో ప్రయాణికుడు కారు స్పేర్పార్ట్లో దాచి తెచ్చిన 398 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.20లక్షలు ఉంటుందన్నారు. అలాగే రాత్రి వచ్చిన విమానంలో ఓ ప్రయాణికుడు లోదుస్తుల్లో దాచి తెచ్చిన 258 గ్రాములు బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.13,63,771 ఉంటుందని అంచనా వేశారు.