హైదర్నగర్లో 8 మంది దారి దోపిడీల ముఠా సభ్యుల అరెస్ట్
ABN , First Publish Date - 2021-04-11T18:02:57+05:30 IST
దారి దోపిడీలకు పాల్పడుతున్న 8 మంది ముఠా సభ్యులను కేపీహెచ్బీ పోలీసులు
హైదరాబాద్/హైదర్నగర్ : దారి దోపిడీలకు పాల్పడుతున్న 8 మంది ముఠా సభ్యులను కేపీహెచ్బీ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ వివరాలు వెల్లడించారు. ఈ నెల 3న వెంకటేశ్వరరెడ్డి తన స్నేహితులతో కలిసి పీఎన్ఆర్ ఎంఫైర్ బిల్డింగ్ ఎదుట నిల్చుని ఉండగా కొంతమంది యువతులు, వ్యక్తులు వచ్చి తమ ఫొటోలు ఎందుకు తీస్తున్నావంటూ వారిపై దాడిచేసి డబ్బులు లాక్కుని అక్కడి నుంచివెళ్లిపోయారు. 4వ తేదీ నిజాంపేట గ్రామానికి చెందిన కాసర్ల వేణు టిఫిన్ పార్సిల్ తీసుకునేందుకు కేపీహెచ్బీ కాలనీ తబలా రెస్టారెంటు ప్రాంతానికి తన బైక్పై వచ్చాడు.
అక్కడికి ఓ యువతి వచ్చి తనకు రెండు వేలు ఇస్తే అతనితో గదికి వచ్చేందుకు సిద్ధమని చెప్పడంతో ఆమెను తన బైక్పై తీసుకుని వేణు బయలుదేరాడు. శాతవాహన నగర్బస్టాప్ వద్ద వేణుపై వెంట వచ్చిన యువతి, ఓ ఆటోలో వచ్చిన మహిళ, కొంతమంది వ్యక్తులు రాయి, పదునైన ఆయుధాలతో దాడి చేశారు. వినోద్ వద్ద ఉన్న రెండు తులాల బంగారు గొలుసు, నాలుగున్నర గ్రాములు బంగారు ఉంగరం, సెల్ఫోన్ లాక్కొని పారిపోయారు. బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం 4వ ఫేజ్లో పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా ఆటో(టీఎస్ 09 యూబీ 6258 నెంబర్)ను ఆపేందుకు ప్రయత్నించగా వారు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఆటోను ఆపి అందులో ఉన్న గంధం విశాల్, భజిని, నవీన్, శైలజ, స్వాతి, గుండె నవీన్, బీరం మధు, సయ్యద్, శివకుమార్ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు అంగీకరించారు. వారి నుంచి ఆటో, 12 సెల్ఫోన్లు, కత్తి స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నారని, 8మందిని కోర్టులో హాజరు పరిచామని పోలీసులు తెలిపారు.