శునకాలకు ఆహారం తినిపించినందుకు ఈ మహిళకు రూ.8 లక్షల జరిమానా.. వాళ్లు చెప్పిన కారణమేంటంటే..

ABN , First Publish Date - 2021-12-17T23:00:23+05:30 IST

కరోనా కష్టకాలంలో తిండి దొరక్క విలవిలలాడిన వీధి కుక్కలకు కొందరు ఆహారం అందించారు.

శునకాలకు ఆహారం తినిపించినందుకు ఈ మహిళకు రూ.8 లక్షల జరిమానా.. వాళ్లు చెప్పిన కారణమేంటంటే..

కరోనా కష్టకాలంలో తిండి దొరక్క విలవిలలాడిన వీధి కుక్కలకు కొందరు ఆహారం అందించారు. వారి పెద్ద మనసుకు ఎన్నో ప్రశంసలు లభించాయి. అదే పని చేసిన ఓ మహిళకు ఆమె నివసిస్తున్న కాలనీ వాళ్లు ఏకంగా రూ.8 లక్షల జరిమానా విధించారు. సొసైటి నియమాల ప్రకారం జరిమానా కట్టాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఆమె యానిమల్ వెల్ఫేర్ బోర్డును ఆశ్రయించింది. ముంబైలోని సీ-వుడ్ ఎన్‌ఆర్ఐ కాంప్లెక్‌లో నివసిస్తున్న అన్షూ సింగ్ అనే మహిళ ఈ ఏడాది జులై నుంచి వీధి కుక్కలకు ఆహారం అందిస్తోంది. 


కాంప్లెక్స్‌ లోపల రోడ్లపై వీధి కుక్కలకు ఆహారం అందిస్తూ ఆమె అపరిశుభ్రతకు పాల్పడుతోందని ఫిర్యాదులు రావడంతో సొసైటీ యాజమాన్యం ఆమెకు రోజుకు రూ.5 వేల చొప్పున ఇప్పటిరకు రూ.8 లక్షలు జరిమానా విధించింది. `నేను చేసిన నేరం ఏంటి? ఆకలితో అలమటిస్తున్న మూగ జీవాలకు ఆహారం అందించడం తప్పా? మీకు చిన్న ఇబ్బంది కలుగుతోందని వాటికి ఆహారం దూరం చేస్తారా?` అంటూ అన్షూ ప్రశ్నిస్తోంది. 


కాగా, ఈ ఘటనపై సొసైటీ యాజమాన్యం స్పందిస్తూ.. `ఈ కాంప్లెక్స్‌లో మొత్తం 40 బిల్డింగ్‌లు ఉన్నాయి. వీధి కుక్కల కోసం ప్రత్యేకంగా ఓ షెడ్డు నిర్మించాం. అక్కడ వాటికి ఆహారం అందించవచ్చు. కాంప్లెక్స్ లోపల వీధి కుక్కలు చేరడం వల్ల పిల్లలు వాటి వెంట పరిగెత్తి గాయాలపాలవుతున్నారు. వృద్ధులు ఇళ్లలో నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. అందుకే సొసైటీ నియమావళిలో ఆ షరుతు పెట్టాం. దాని ఆధారంగానే జరిమానా విధించామ`ని స్పష్టం చేసింది. కాగా, సొసైటీ నిర్ణయంపై అన్షు యానిమల్ వెల్ఫేర్ బోర్డును ఆశ్రయించింది.

Updated Date - 2021-12-17T23:00:23+05:30 IST